డిచ్పల్లి, డిసెంబర్ 8: ఒకేచోట ముగ్గురు దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. డిచ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని నడిపల్లిలో ఎన్హెచ్ 44 పక్కన గురునానక్ హార్వెస్టర్ వర్క్షాపు ఉన్నది. ఇందులో పంజాబ్లోని సాహోకే గ్రామానికి చెందిన హర్పాల్ సింగ్ (33) ఎనిమిది నెలలుగా మెకానిక్గా పనిచేస్తున్నాడు. రెండురోజుల క్రితం పంజాబ్కే చెందిన జోగీందర్ సింగ్ (45)ను మెకానిక్గా పనిచేసేందుకు పిలిపించారు. మంగళవారం రాత్రి పనులు ముగించుకొని నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు షెడ్డులోకి చొరబడి మారణాయుధాలతో ఇద్దరి తలలపై మోది హత్యచేశారు. వర్క్షాపులోనే నిద్రించే సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని భోజ్యానాయక్ తండా కు చెందిన బానోత్ సునీల్ (25) అనే క్రేన్ డ్రైవర్ను సైతం దుండగులు హతమార్చారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు హత్యల విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ, అడిషనల్ డీసీపీ(క్రైమ్) స్వామి ఘటనాస్థలిని పరిశీలించారు. డాగ్స్కాడ్ మృతదేహాల వద్ద నుంచి ఆర్మూర్ రోడ్డువైపు వెళ్లి ఆగిపోయింది. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సీపీ తెలిపారు. వర్క్షాపులోని మూడు సీసీ కెమెరాలు కొద్దిరోజుల క్రితమే మరమ్మతులకు గురైనట్టు వర్క్షాపు యజమాని సంజీవ్రెడ్డి పోలీసులకు చెప్పారు. మరో 15 రోజుల్లో పనులు ముగించుకొని పంజాబ్ వెళ్లాల్సిన సమయంలో హర్పాల్సింగ్, జోగీందర్సింగ్ హతమవ్వడం విషాదం నింపింది.