Bangladesh : బంగ్లాదేశ్ పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోబోతున్న బీఎన్పీ తరఫున ముగ్గురు హిందువులు విజయం సాధించారు. మొత్తం ఆరుగురు మైనారిటీలకు బీఎన్పీ టిక్కెట్లివ్వగా అందులో నలుగురు గెలిచారు. వారిలో ముగ్గురు హిందువులున్నారు. దీంతో ఆ పార్టీ మైనార్టీలకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లైంది. బంగ్లాదేశ్ పార్లమెంట్లో హిందువులకు ప్రాతినిధ్యం దక్కింది.
13వ పార్లమెంటరీ ఎన్నికల్లో బీఎన్పీ.. మిత్ర పక్షాలతో కలిసి 209 సీట్లలో విజయం సాధించింది. తారిఖ్ రహమాన్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. బీఎన్పీ తరఫున ఢాకా-3 స్థానం నుంచి హిందువు, సీనియర్ లీడర్ అయిన గయేశ్వర్ చంద్ర రాయ్ విజయం సాధించారు. ఆయనకు 99,163 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి, జమాత్ పార్టీ అభ్యర్థి ఎండీ షాహినూర్ ఇస్లాంకు 83,264 ఓట్లు వచ్చాయి. ఈయన గతంలో బీఎన్పీ తరఫున కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మరో హిందువు, బీఎన్పీ వైస్ ఛైర్మన్ నితాయ్ రాయ్ చౌదురి మగుర-2 స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ఆయనకు 147,896 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి, జమాత్ పార్టీ అభ్యర్థి ముస్తాహిద్ బిల్లాకు 117,018 ఓట్లు వచ్చాయి. రంగమతి అనే మరో స్థానం నుంచి అడ్వకేట్ అయిన దీపెన్ దేవాన్ అనే హిందూ అభ్యర్థి 31,222 ఓట్లతో గెలుపొందారు. ఆయన తన సమీప ఇండిపెండెంట్ అభ్యర్థి పహేల్ చక్మాపై గెలిచారు. చక్మాకు 21,544 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
ఇలా గయేశ్వర్ చంద్ర రాయ్, నితాయ్ రాయ్ చౌదురి, దీపెన్ దేవాన్ అనే ముగ్గురు హిందువులు బంగ్లాదేశ్ పార్లమెంట్కు ఎన్నికయ్యారు. ఈ ముగ్గురూ బీఎన్పీ నుంచే గెలవడం విశేషం. ఇక ప్రతిపక్షానికే పరిమితమైన జమాతే ఇస్లామీ పార్టీ మొత్తం సీట్లలో ఒకే హిందువును అభ్యర్థిగా నిలిపింది. క్రిష్ణ నంది అనే హిందువు ఖుల్నా-1 స్థానం నుంచి పోటీ చేయగా, బీఎన్పీ అభ్యర్థి అమీర్ ఎజాజ్ ఖాన్ చేతిలో ఓడిపోయారు. బంగ్లా ఎన్నికల్లో వివిధ పార్టీలు, స్వతంత్రులు మొత్తం కలిపి 79 మంది పోటీ చేశారు.