పీర్జాదిగూడ, జనవరి 22 : తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మల్కాజిగిరి జోన్ ఏసీపీ ఎన్.శ్యాంప్రసాద్, మేడిపల్లి డీఐ మక్బూల్జానీ వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామానికి చెందిన మహ్మద్ ఇమామ్(20), బదవత్ గాంధీ(20), పరిటాల నాగరాజు(26) స్నేహితులు. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని పథకం వేశారు.
ఉప్పల్, మేడిపల్లి, ఘట్కేసర్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఆటోల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి చోరీ చేయడం మొదలు పెట్టారు. ఇలా 12 ఇండ్ల తాళాలు పగులగొట్టి చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్నారు. మేడిపల్లి ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన దొంగతనాలను ఒప్పుకున్నారు. వారి వద్దనుంచి రూ.4 లక్షల బంగారు ఆభరణాలు, 70తులాల వెండి, రూ.20వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లక్ష్మణ్, ఏఎస్సై మల్లేశ్, క్రైమ్ సిబ్బంది నాగేందర్, సునీల్, రాజేశ్, సాయిదీప్, హరి, తదితరులు ఉన్నారు.