బౌద్ధనగర్, జనవరి 19 : తాళంవేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న భార్యాభర్తలతో పాటు దొంగిలించిన సొమ్మును కొనుగోలు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మారావునగర్ ప్రాంతంలో నివాసముండే కొమ్మని శ్రీనివాస్ (33), కనుకుర్తి ప్రియ(30)భార్యాభర్తలు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడటం మొదలుపెట్టారు. పగలు రెక్కీ నిర్వహించి తాళాలువేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకుని రాత్రి సమయాల్లో చోరీలు చేయడం పరిపాటిగా మారింది. దొంగిలించిన సొమ్మును భార్య ప్రియతో కలిసి అట్టికా గోల్డ్ కంపెనీలో పనిచేస్తున్న మహ్మద్ ఖాదర్ అలీ (30)కి విక్రయిస్తుంటారు.
ఈ సొమ్మును ఖాదర్ అలీ కర్నాటకలోని అట్టికా గోల్డ్ కంపెనీ మేనేజర్కు చేరవేస్తుంటాడు. వచ్చిన డబ్బుతో శ్రీనివాస్, ప్రియ జల్సాలు చేస్తుంటారు. అయితే శ్రీనివాస్పై నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 32కేసులు ఉన్నాయి. ఇందులో 25 కేసుల్లో జైలు శిక్ష అనుభవించగా… భయటకు వచ్చిన తర్వాత పోలీసులు అతడికి చాయ్ హోటల్ పెట్టించారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో అతడిపై 2015లో పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనివాస్ దంపతులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 46 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు యాక్టివా బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. అట్టిక గోల్డ్ కంపెనీ మేనేజర్ కోసం గాలిస్తున్నారు.