హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): గీత వృత్తిని, వృత్తిదారులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న కొందరు అహంకార పూరిత రాజకీయనాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని కుల సంఘాల ప్రతినిధులకు రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం నెక్లెస్రోడ్డులో ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నీరాకేఫ్ పనులను రాష్ట్ర గౌడ సంఘాల ప్రతినిధులు, ఎక్సైజ్, పర్యాటక శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు కులవృత్తులను నిర్లక్ష్యం చేస్తే..తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నారని అన్నారు. గతంలో పాలకులు ఔషధ గుణాలున్న నీరాను, కల్లును హైదరాబాద్ నగరంలో నిషేధించి అవమానించారని గుర్తు చేశారు. హైదరాబాద్లో సుప్రసిద్ధమైన నెక్లెస్ రోడ్డులో రూ.25 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా నీరా కేఫ్ను నిర్మిస్తున్నామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని నందనం, సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామం, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మునిపల్లి, రంగారెడ్డి జిల్లాలోని అమనగల్లు మండలం చరికొండలో నీరా ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కే కిశోర్ గౌడ్, ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, టూరిజం ఎండీ మనోహర్, గౌడ సంఘాల రాష్ట్ర ప్రతినిధులు పల్లె లక్ష్మణ్రావుగౌడ్, బాలరాజుగౌడ్, చింతల మల్లేశంగౌడ్, వట్టికూటి రామారావుగౌడ్, నాగేశ్వరరావుగౌడ్, వేములయ్యగౌడ్, అయిలి వెంకన్నగౌడ్, ఎలికట్టె విజయ్కుమార్గౌడ్, ఈతముల్లు ప్రసాద్తోపాటు ఎక్సైజ్శాఖ ఉన్నతాధికారులు అజయ్రావు, హరికిషన్, డేవిడ్ రవికాంత్, చంద్రయ్య, సత్యనారాయణ, రవీందర్రావు, అరుణ్కుమార్, విజయ్భాసర్గౌడ్, సీఐ లక్ష్మణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.