న్యూఢిల్లీ, మార్చి 7: ‘తినడానికి తిండి లేదు. తాగడానికి నీళ్లు లేవు. తెరిచిన దుకాణాల్లో రొట్టె ముక్క కొనుక్కొందామంటే కార్డ్స్ను అంగీకరించట్లే. ఏటీఎంలలో డబ్బులు రావట్లేదు. బయటకు రావాలంటే బాంబుల భయం. కరెంటు కూడా లేని బంకర్లో పది రోజులుగా బతుకీడుస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని కాపాడుతుందన్న ఆశ చచ్చిపోయింది’ ఉక్రెయిన్లోని సుమీ నగరంలో చిక్కుకొన్న ఓ భారత విద్యార్థిని మనోవ్యథ ఇది. ‘అందరం కలిసి కాలినడకన సరిహద్దులకు బయల్దేరాలనుకొన్నాం. అయితే, రిస్క్ చేయవద్దని, ఉన్నచోటునే ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అందుకే, ఇక్కడే ఉండిపోయాం. అయితే, ఎంతకాలం ఇలా ఉండాలి? ఎప్పుడు మమ్మల్ని కాపాడుతారు?’ అని అజిత్ గంగాధరణ్ అనే మరో విద్యార్థి ప్రభుత్వాన్ని నిలదీశాడు. తమతో పాటు దాదాపు 700 మంది నగరంలో చిక్కుకుపోయారని, మంచును కరిగించుకొని దాహం తీర్చుకొంటున్నామని తెలిపాడు. ప్రభుత్వం వెంటనే తమను రక్షించాలని విజ్ఞప్తి చేశాడు.
పుతిన్, జెలెన్స్కీకి మోదీ ఫోన్
సుమీలో చిక్కుకొన్న భారతీయులను వీలైనంత త్వరగా సురక్షితంగా తీసుకురావడానికి సాయం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ప్రధాని మోదీ కోరారు. ఈ మేరకు ఇరువురితో వేర్వేరుగా మాట్లాడారు. తరలింపు విషయంలో ప్రభుత్వ వైఖరిపై సుమీలోని విద్యార్థులు మండిపడ్డాకనే మోదీ సర్కారు మేల్కొన్నదని శివసేన ఎద్దేవా చేసింది. విద్యార్థులందరినీ తరలించడం ప్రభుత్వ బాధ్యత అని కాంగ్రెస్ పేర్కొంది.