న్యూఢిల్లీ, జనవరి 17: రాబోయే పాతికేండ్లలో భారత్ అభివృద్ధి కాలుష్యరహితంగా, హరితంగా మాత్రమే కాకుండా సుస్థిరమైన, విశ్వసనీయమైన రీతిలో ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే అనుకూల సమయమని పేర్కొన్నారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సోమవారం వర్చువల్గా పాల్గొన్న ప్రధాని ప్రసంగించారు. వచ్చే పాతికేండ్లకు భారత్ సంక్షేమం, ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ లక్ష్యాలు నిర్దేశించుకున్నదని చెప్పారు. ఓవైపు ఆర్థికవృద్ధిని కొనసాగిస్తూనే కరోనా మరోవిడత ఉప్పెనను ఎదుర్కొంటున్నదని ఆయన అన్నారు. ఆర్థిక సంస్కరణలను సరైన మార్గంలోనే నడిపిస్తున్నదని, నిపుణులు భారత్ను ప్రశంసిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.