సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఆత్మహత్యలు వద్దు.. ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగు అంటూ జనాల్ని జాగృతం చేసేందుకు నడుం బిగించారు స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధులు. చిన్నచిన్న కారణాలతో చాలామంది నిండు జీవితాలను బలితీసుకుంటున్నారని ఫౌండేషన్ తన నివేదికలో వెల్లడించారు. ముఖ్యంగా యువత ప్రభుత్వ ఉద్యోగాన్నే జీవితంగా భావించడం సరైనది కాదని.. ప్రత్నామ్యాయంగా ఎన్నో ఉద్యోగ అవకాశాలు ముంగిటే ఉన్నాయని భరోసానిచ్చారు. ప్రతి ఒక్క యువకుడు తమ ముందున్న వనరులను వినియోగించుకుని ఉపాధి సృష్టికర్తలుగా తయారవ్వాలని సూచించారు వారు. అందులో భాగంగానే శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆత్మహత్యల నివారణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
అతడి పేరు భాను (పేరు మార్చాం). ప్రభుత్వ ఉద్యోగం కోసం నాలుగేండ్లుగా ప్రయత్నిస్తున్నాడు. తోటి మిత్రులు పలు రకాల వ్యాపారాల్లో రాణిస్తుండగా భాను మాత్రం సర్కార్ కొలువు కోసం శ్రమించాడు. అనుకున్నంతగా మార్కులు రాకపోవడంతో క్వాలిఫై కాలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
స్కూల్ యాజమాన్యం మందలించిందని ఖమ్మం జిల్లాకు చెందిన చల్లా భానుప్రకాష్(17) పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్టిన రోజు వేడుకలు స్కూల్లో జరుపుకోవడంపై టీచర్లు ఆగ్రహించడంతో క్షణికావేశంలో సూసైడ్ చేసుకున్న సంఘటన స్థానికుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
తొమ్మిది నెలలు.. 270 రోజులు.. ఒక ప్రాణం తల్లి గర్భంలో ఊపిరిపోసుకుని భూమి మీదకు రావడానికి పట్టే సమయం. పురిటినొప్పులను భరించి తల్లి తన బిడ్డకు జన్మనిస్తుంది. జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కించడానికి.. పేరేంట్స్ అనేక కష్టాలు ఎదుర్కొంటారు. మంచి భవిష్యత్తు అందించాలనేదే వారి తాపత్రయమంతా. కానీ బదులుగా కొంతమంది పిల్లలు ఏం ఇస్తున్నారు.? కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుని జీవితకాల శిక్ష విధిస్తున్నారు.
18 నుంచి 45 ఏండ్ల లోపు యువకులు 67 శాతం మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆర్థిక కారణాలు, కుటుంబం, వివాహ సమస్యలు తదితర కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాలు దొరకడం లేదని ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. అనుకున్న ఉద్యోగాలు రాకపోవడం వెనక నైపుణ్యం కీలకంగా ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలి. వ్యవసాయంలోనూ ఎన్నో అవకాశాలున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్తో సొంతంగా ఉపాధి పొందే వీలుంది. ఆత్మహత్యలు గ్రామాల్లో కంటే అర్బన్లోనే అధికంగా ఉంటున్నాయి. వీటిపై స్టడీ చేసి నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్ఫూర్తి ఫౌండేషన్ ఆ బాధ్యతను తీసుకోవడం గొప్ప విషయం. – జేడీ లక్ష్మీనారాయణ. రిటైర్డ్ ఐపీఎస్.
ఎంతోమంది విద్యావంతులైన నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఉద్యోగాలు రావడం లేదని తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారి ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలి. వారిలో ఆశావహ దృక్పథాన్ని పెంచడానికే ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. అన్ని జిల్లాల్లో పర్యటించి నిరుద్యోగులకు ప్రత్నామ్నాయ ఉపాధి అవకాశాలను తెలియజేస్తాం. జీవితపు సవాళ్లను స్వీకరించి నిలిచే ఆత్మనిర్భరతను పెంచుతాం. – డాక్టర్ సి.వీరేందర్, సైకాలజిస్టు (కన్వీనర్, స్ఫూర్తి ఫౌండేషన్)
ప్రెగ్నెంట్ మొదలు బిడ్డకు జన్మనిచ్చే వరకు అనుక్షణం వారికోసం తపించి బతుకుతారు తల్లిదండ్రులు. బిడ్డ పుట్టాక ఎదిగే క్రమంలో అనేక నిద్రలేని రాత్రులు గడిపి వారి ఆలనాపాలనా చూస్తారు. మంచి చదువు అందించి అండగా ఉంటారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని కలలు కంటారు. కానీ.. చిన్నచిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చడం సరైనది కాదు. – డాక్టర్ మాధవి, గైనకాలజిస్టు.
నేను ఓ సంస్థలో పనిజేశాను. ఆ తర్వాత చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. ఓ సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ సమయంలో గూగుల్లో ఎలా ఆత్మహత్య చేసుకోవాలని శోధనకు బదులుగా ఆపడం ఎలా అని సెర్చ్ చేశాను. అప్పుడు ఎలిప్ సంస్థ వివరాలు వచ్చాయి. సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఎదగడంపై ఆ సంస్థ సహకరిస్తుంది. వారిని సంప్రదించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను నెలకొల్పాను. విజయవంతంగా నడుపుతున్నాను. – సుశీల, ఎంట్రప్రెన్యూర్.