వరంగల్ అర్బన్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బెదిరించి దోపిడి, దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడుని గీసుగొండ, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసారు. నిందితుడి నుండి పోలీసులు 13 గ్రాముల బంగారు ఆభరణాలు, 630 గ్రాముల వెండి సామాను, రూ.48 వేల నగదు, ఒక మొబైల్, విదేశీ కరెన్సీ, ఓ బైక్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా, గార్ల బయ్యారం, పేతాళ్ళగడ్డ గ్రామం, ప్రస్తుతం గొర్రెకుంటలోని కీర్తినగర్లో నివాసం వుంటున్న మందనపు సుభాష్ కట్టె కోత మిషన్ వద్ద రోజు కూలీ పనిచేసేవాడు. వచ్చే డబ్బుతో తాగుడుతో పాటు ఇతర జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నిందితుడు 2008 సంవత్సరం నుండి వరుస చోరీలకు పాల్పడటం ప్రారంభించాడు.
గురువారం గీసుగొండ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కల్సి గోర్రెకుంట క్రాస్ రోడ్ వద్ద వాహన తనీఖీలు నిర్వహస్తుండగా నంబర్ లేని వాహనంపై వస్తున్న నిందితుడు అనుమానస్పదంగా కనిపించడంతో తనీఖీ చేయగా కత్తి కనిపించడంతో నిందితుడిని అదుపులోని తీసుకోని విచారించగా పాల్పడిన నేరాలను అంగీకరించాడు. నిందితుడుని సకాలంలో అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన మామూనూర్, క్రైమ్ ఏసీపీలు నరేష్ కుమార్, బాబురావు, గీసుగొండ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్, గీసుగొండ ఎస్.ఐ అబ్దుల్ రహీం, బండారి రాజు, కానిస్టేబుల్ మహేందర్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ జంపయ్య, కానిస్టేబుల్స్ మహ్మమద్ ఆలీ, నర్సింగరావు, చంద్రశేఖర్ ను సీపీ అభినందించారు.