హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): థర్మో ఫిషర్ సైంటిఫిక్స్ సంస్థ కొత్తగా హైదరాబాద్లో ఆర్అండ్డీ, ఇంజినీరింగ్ ఫెసిలిటీ.. ఇండియా ఇంజినీరింగ్ సెంటర్ (ఐఈసీ)ను ప్రారంభించింది. హైటెక్సిటీ వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్రపంచ శ్రేణి కేంద్రాన్ని గురువారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ప్రారంభించారు. ఈ సెంటర్తో 140 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. దేశీయ థర్మో ఫిషర్ ఆర్అండ్డీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో భాగమే కొత్తగా విస్తరించిన ఈ ఐఈసీ.
మొత్తం ఆర్అండ్డీలో ఏటా 1.4 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులను పెడుతున్న థర్మో ఫిషర్ సైంటిఫిక్స్.. ఈ సెంటర్లో 15 మిలియన్ డాలర్ల వార్షిక పెట్టుబడులు పెట్టనున్నది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆసియా దేశాల్లో నేడు లైఫ్ సైన్సెస్ హబ్గా తెలంగాణ రాష్ట్రం గుర్తింపు సాధించిందన్నారు. పెట్టుబడులు, విస్తరణకు గమ్యస్థానంగా మారిందని చెప్పారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, నైపుణ్యంగల ఉద్యోగులు, ప్రభుత్వ అనుకూల విధానాలు తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. థర్మో ఫిషర్ సైంటిఫిక్స్ ఐఈసీ ఏర్పాటు రాష్ట్రంలోని జీవశాస్ర్తాల రంగ పర్యావరణ వ్యవస్థకు, ప్రభుత్వ వ్యాపార అనుకూల విధానాలకు నిదర్శనమన్నారు.
థర్మో ఫిషర్ ఐఈసీ.. ప్రపంచంలోని మరిన్ని ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్కు వచ్చేలా దోహదపడగలదన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఎఫ్డీవై బెంచ్మార్క్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత మెరుగైన ఆర్అండ్డీ, లైఫ్ సైన్సెస్ క్లస్టర్ల కేంద్రంగా ఉన్నట్టు తేలిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.
హైదరాబాద్ నగరం ప్రతిభాపాటవాల సముపార్జనకు ప్రధాన కేంద్రంగా, ప్రపంచ ప్రసిద్ధి ఆర్అండ్డీ ఇనిస్టిట్యూట్లకు నిలయంగా మారిందన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ రాష్ట్రం 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ఇక ఈ సెంటర్ ద్వారా 450 మందికి ఉపాధి అవకాశాలు దక్కనుండటం సంతోషకరమన్నారు.
ఈ కేంద్రాన్ని 42,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇందులో అత్యాధునిక ఇంజినీరింగ్ ల్యాబ్వంటి సదుపాయాలున్నాయి. ముఖ్యంగా కొత్త ఉత్పత్తుల అభివృద్ధికి, థర్మో ఫిషర్స్ గ్లోబల్ సైట్లకోసం విశ్లేషణాత్మక పరిష్కారాలకు ఈ ల్యాబ్ దోహదం చేయనున్నది. రాష్ట్రంలోని ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలను కల్పించడమే కాకుండా వివిధ రకాల సాధనాల రూపకల్పన, అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఈ సెంటర్ కలిగి ఉంటుంది.
ఇందులో 450 మంది విభిన్న ప్రతిభావంతులైన ఇంజినీర్లు, విక్రేత భాగస్వాములు పనిచేయనున్నారు. ఎంపీ రంజిత్రెడ్డి, థర్మో ఫిషర్ ఆసియా పసిఫిక్, జపాన్ ప్రెసిడెంట్ టోనీ అసియారిటో, సంస్థ ఇండియా, దక్షిణాసియా ఎండీ అమిత్ చోప్రా, తెలంగాణ లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.