తిరుపతి, జూలై: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)దేశవాళీ ఆవుల పోషణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. అందుకోసంటీటీడీ ఆధ్వర్యంలో పలమనేరులో ఏర్పాటుచేసిన గోశాలలో దేశీయ గోజాతులను అభివృద్ధి చేసి గోసంరక్షణకు చర్యలు చేపడుతున్నామని టీటీడీ ఈఓ డా.కె.ఎస్.జవహర్రెడ్డి తెలిపారు. పలమనేరులోని టిటిడి గోశాలను ఈవో సందర్శించారు. దేశవాళీ గోవులను, వృషభాలను పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
పలమనేరులోని ఎస్వీ గోశాలకు పశువైద్య విశ్వవిద్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు కేటాయించిందని డా.కె.ఎస్.జవహర్రెడ్డి అన్నారు.
ఇక్కడ దేశవాళీ గోజాతుల అభివృద్ధి, గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తుల తయారీ చేపడతామని తెలిపారు. వీటిపై రైతులకు అవగాహన కల్పిస్తామని, తద్వారా రైతులకు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందని చెప్పారు. ఇక్కడి గోశాలకు వెయ్యికి పైగా దేశీయ గోవులు, వృషభాలు ఉన్నాయని, తిరుపతిలోని గోశాల నుంచి మరో వెయ్యి గోవులను తరలిస్తామని వెల్లడించారు. ఇందుకోసం అవసరమయ్యే షెడ్లు తదితర నిర్మాణాలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు.
గోశాల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ గోశాలను వాటర్షెడ్గా పరిగణించి గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో మరింత అభివృద్ధి చేపడతామని తెలిపారు. కార్పొరేట్ సంస్థలు, దాతలు ఈ గోశాలలో మౌలిక వసతులు పెంచేందుకు ముందుకు రావాలని కోరారు. అదేవిధంగా, అంకితభావం గల నిపుణులైన శాస్త్రవేత్తలు ముందుకొచ్చి దేశీయ గోజాతులను అభివృద్ధికి సహకరించాలని కోరారు.