‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’,‘స్వయంకృషి’వంటి క్లాసిక్ మూవీస్ నిర్మించిన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ సంస్థ నుంచి అనుబంధంగా శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. మిత్రవిందా మూవీస్తో కలిసి ఈ సంస్థలో నిర్మించే తొలి సినిమాకు ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే టైటిల్ ఖరారు చేశారు. కథ స్క్రీన్ప్లే, మాటలు ‘జాతిరత్నాలు’ దర్శకుడు కేవీ ఆనంద్ అందిస్తున్నారు.
వంశీధర గౌడ్, పి. లక్ష్మీనారాయణ దర్శకులు. ఈ సినిమాతో ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా మారుతున్నది. ఈ చిత్ర లోగోను సోమవారం హైదరాబాద్లో విడుదల చేశారు. దర్శకులు వంశీ, నాగ్ అశ్విన్ అతిథులుగా పాల్గొన్నారు. నిర్మాత శ్రీజ మాట్లాడుతూ..‘నిర్మాతగా మా తాతగారే ఆదర్శం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. అలాంటి మంచి చిత్రాలు నిర్మించాలనే ప్రొడక్షన్ ప్రారంభించాం. అయితే క్లాసికల్ తరహా కాకుండా హాయిగా నవ్వుకునే వినోదాత్మక చిత్రాలు నిర్మించాలని అనుకుంటున్నాం’ అన్నారు.
‘నాన్న స్ఫూరితో నా కూతురు శ్రీజ నిర్మాతగా మారింది. ఆమె నిర్మిస్తున్న మొదటి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు ఏడిద శ్రీరామ్.