చిక్కడపల్లి, జనవరి 2: బా్ంయకులను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని ఆలిండియా రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఆర్ఆర్బీఈఏ) ప్రధాన కార్యదర్శి సోలిపేట వెంకటేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ముతో ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థలను ఏవిధంగా ప్రైవేటీకరిస్తారని ప్రశ్నించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) పెన్షనర్ల అసోసియేషన్ 2వ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీజీవీబీలో ఉద్యోగ విరమణ పొందినవారికి వాణిజ్య బ్యాంకు ఉద్యోగుల మాదిరిగా పెన్షన్ను సాధించేందుకు దాదాపు 30 ఏండ్లు పోరాడామని, 2018లో సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో గ్రామీణ బ్యాంకు ఉద్యోగులంతా పెన్షన్ పొందుతున్నారని చెప్పారు. ఇంకా ఫ్యామిలీ పెన్షన్, అప్డేషన్ పెన్షన్, గ్రాట్యూటీ చట్టం అమలు డిమాండ్ల సాధనకు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభం వెంకట్రెడ్డి, ఏపీ, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీరవికాంత్ తదితరులు పాల్గొన్నారు.