సిటీబ్యూరో, జనవరి 1(నమస్తే తెలంగాణ): ‘ఒరేయ్.. బాబు.. ఇంటికి తొందరగా వచ్చేయ్రా.. మద్యం తాగి.. వాహనాన్ని నడపకురా.. కొత్త సంవత్సరం ఇంట్లో ఉండాలి.. జైలు, పోలీస్స్టేషన్ వద్దురా’.. ఇలా కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు ఒకరికి ఒకరు చెప్పుకోవడంతో ఈ సారి ట్రై కమిషనరేట్ల పరిధిలో విషాదాన్ని మిగిల్చే ఘటనలు చోటుచేసుకోలేదు. పోలీసులు పెట్టుకున్న లక్ష్యం ‘ఇన్సిడెంట్…యాక్సిడెంట్ ఫ్రీ’ సక్సెస్ అయ్యింది. 90 శాతం మంది వేడుకలకు హాజరైనా.. మద్యం సేవించిన వారు డ్రైవర్లను పెట్టుకొని ప్రయాణించడం కనిపించింది. అటు పౌరుల బాధ్యత, ఇటు పోలీసుల అవగాహనతో కొత్త సంవత్సరంలో వాహనదారుల్లో చాలా మార్పు కనిపించింది. దావత్లు చేసుకొని.. సురక్షితంగా ఇంటికి చేరుకోవడం కుటుంబసభ్యుల్లో సంతోషాన్ని నింపింది. అత్యంత బాధ్యతగా వ్యవహరించిన హైదరాబాద్ పౌరులకు పోలీసులు జై కొట్టారు.
సురక్షితంగా ఇంటికి
మందు బాబులకు ట్రై పోలీసు కమిషనరేట్ పరిధిలో ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు ఉండరన్న ఉద్దేశంతో 1 గంట తర్వాత బయటికి వచ్చారు. అయితే రహదారులపై ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ ఎనలైజర్తో కనిపించడంతో అవాక్కయ్యారు. కౌంట్ పరిమితికి మించి దాటడంతో అనేక మంది పట్టుబడ్డారు. సైబరాబాద్ పరిధిలో 873 మంది, హైదరాబాద్లో 1265, రాచకొండలో 360 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయారు. పోలీసులు చాలా చోట్ల తనిఖీల కోసం బారికేడ్లు, రేడియం స్టిక్కర్లతో బోలార్డ్స్ను ఏర్పాటు చేయడంతో మందుబాబులు తప్పించుకొని వెళ్లలేకపోయారు. ఇలా తనిఖీలను తెల్లవారుజాము 5 గంటల వరకు నిర్వహించడంతో విషాదాలు తప్పాయి..మందుబాబులు, ఇతర వాహనదారులు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు.
ఫలించిన వ్యూహం
డ్రంక్ అండ్ డ్రైవ్పై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించడంతో ఈసారి వాహనదారుల్లో కూడా చాలా మార్పు కనిపించిందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్ అన్నారు. మద్యం మత్తులో ఉన్న అనేక మంది వాహనదారులు డ్రైవర్లను ఎంగేజ్ చేసుకున్నట్లు గుర్తించామని తెలిపారు. కాగా, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారి డ్రైవింగ్ లైసెన్స్ల సస్పెన్షన్ కోసం ఆర్టీవో అధికారులకు సిఫార్సు చేయనున్నారు. అభియోగాలు నమోదు చేసి త్వరలోనే కోరుల్లో చార్జిషీట్లను పొందుపర్చనున్నారు.
జాగ్రత్తలు పాటించండి…
ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రజలంతా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించాలని ట్రై కమిషనరేట్ల సీపీలు సూచించారు.