కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. క్లాక్స్ దర్శకుడు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్రబెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లాప్నివ్వగా, హీరో కార్తికేయ సతీమణి లోహిత కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘డ్రామా, కామెడీ కలబోతగా రూపొందిస్తున్న డ్రామెడీ జోనర్ చిత్రమిది. ఎవరు ఏమనుకున్నా..తనదైన దారిలో వెళ్లే యువకుడి జీవిత ప్రయాణమేమిటన్నదే చిత్ర ఇతివృత్తం’ అన్నారు. ‘గోదావరి నేపథ్యంలో కథ నడుస్తుంది. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాం. ఉభయ గోదావరి జిల్లాలు, యానాం పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతాం. ఈ సినిమాలో స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఓ పాట రాశారు. ఆయన రాసిన ఆఖరు పాటే ఇదే’ అని నిర్మాత తెలిపారు. అజయ్ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ఎల్బీశ్రీరామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సన్నీ, ఎడిటర్: విప్లవ్ న్యాసదం, సంగీతం: మణిశర్మ, సహనిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి.యువరాజ్, రచన-దర్శకత్వం: క్లాక్స్.