మెల్బోర్న్: ఐపీఎల్లో ప్లేఆఫ్స్ అవకాశాలకు చేరువవుతున్న సమయంలో కోల్కత్తా నైట్రైడర్స్కు ఊహించని దెబ్బ తగిలింది. తుంటి ఎముక గాయం కారణంగా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ లీగ్ నుంచి వైదొలిగాడు. తప్పక గెలువాల్సిన మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉండడం లేదు. రెండు వారాల పాటు పునరావాసం కోసం ఆస్ట్రేలియాకు బయల్దేరాడు. వచ్చే నెలలో శ్రీలంకతో జరుగనున్న సిరీస్ కోసం కెప్టెన్ కమిన్స్ కోలుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ను వదిలేసి స్వదేశానికి వెళ్లాడు. ‘గాయం కారణంగా కమిన్స్ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. రెండు వారాల పునరావాసం కోసం స్వదేశానికి బయల్దేరి వెళ్లాడు’ అని కేకేఆర్ ప్రకటించింది. ‘భారత్లో అద్భుతమైన క్షణాలు పొందా. నన్ను.. నా కుటుంబాన్ని సంరక్షించిన కేకేఆర్కు కృతజ్ఞతలు. టోర్నమెంట్లో తదుపరి ఆటకు అందరికీ నా శుభాకాంక్షలు’ అని కమిన్స్ తెలిపాడు. రూ.7.25 కోట్లకు అమ్ముడుపోయిన కమిన్స్ ఐపీఎల్లో కేవలం ఐదు మ్యాచ్లు ఆడి ఏడు వికెట్లు పడగొట్టాడు. మొత్తం 63 పరుగులు చేయగా.. వాటిలో ముంబై ఇండియన్స్పై 14 బంతుల్లో (56 నాటౌట్) రన్స్ చేసి ఆకట్టుకున్నాడు.