53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫ్పీ)లో ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాను ప్రదర్శించడాన్ని తప్పుబట్టారు జ్యూరీ హెడ్ నాదవ్ లాపిడ్. ఇజ్రాయెల్ ఫిలింమేకర్ అయిన నాదవ్ ఈసారి జ్యూరీకి సారథ్యం వహిస్తున్నారు. ఇండియన్ పనోరమా కేటగిరీలో ఈ నెల 22న ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇందులో ప్రదర్శించిన 15 చిత్రాల్లో ఇదొకటి. చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శించడంపై నాదవ్ లాపిడ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ…‘ఇండియన్ పనోరమాలో ప్రదర్శించిన 15 చిత్రాలు బాగున్నాయి. కానీ ‘ద కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రోత్సవాలకు సరైనది కాదు అనిపించింది. కొందరి ప్రాపగండా కోసం రూపొందించిన సినిమా ఇది. జ్యూరీగా ఎలాంటి జంకు లేకుండా మా అసంతృప్తిని వెల్లడించడం మంచిదని నా అభిప్రాయం. విమర్శలను కూడా స్వీకరిస్తారని నమ్ముతున్నాం’ అని అన్నారు. ఈ నెల 20 నుంచి 28 దాకా 9 రోజుల పాటు సాగిన ఇఫ్ఫీ వేడుకలు సోమవారంతో ముగిశాయి.