Hyderabad Metro | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలుకు రోజుకో రకం కొత్త కష్టం వచ్చి పడుతున్నది. కొన్నాళ్లుగా స్వాధీన ప్రక్రియలో అవాంతరాలతో ఆగం కాగా, ఇప్పుడు రోజువారీ నిర్వహణ తీవ్ర సందిగ్ధంలో పడింది. ఎల్ అండ్ టీ నుంచి స్వాధీన ప్రక్రియ మధ్యలో ఆగిపోవడంతో నిర్వహణ భారాన్ని ఎవరు మోయాలన్న వాదన మొదలైంది. ఈ అంశంపై కొన్ని రోజులుగా ఎల్ అండ్ టీ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అనధికారికంగా చర్చలు జరుగుతున్నా ఫలితం తేలడం లేదు. ఎస్బీఐ క్యాప్స్ సంస్థ మెట్రోరైలు ఆస్తులను మదింపు చేసి, రుణ సమీకరణ ప్రక్రియ పూర్తి చేసేవరకు కనీసం ఐదు నెలలు పడుతుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అప్పటివరకు నిర్వహణ బాధ్యతలు ఎవరు తీసుకోవాలనే అంశంలో తీవ్ర అనిశ్చితి నెలకొన్నది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్భాటానికి పోయి 69 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న మొదటి దశ మెట్రో మార్గాన్ని ఎల్ అండ్ టీ నుంచి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మెట్రో నిర్వహణలో రోజూ రూ.2.5 కోట్ల నష్టం వస్తుండగా, స్వాధీన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఎల్ అండ్ టీ ఈ భారాన్ని దింపుకొన్నది. అయితే రుణ మంజూరుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పేచీ కారణంగా రీ ఫైనాన్సింగ్ ప్రక్రియ చివరి అంకానికి చేరుకున్న దశలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో మెట్రోను ఎవరు నిర్వహిస్తారన్న ప్రశ్న మొదలైంది. ఇప్పటికే ఈక్విటీ షేర్ పూర్తిస్థాయిలో ప్రభుత్వం పేరిట బదిలీ అయ్యిందని, కాబట్టి ఇకపై మెట్రో నిర్వహణ భారాన్ని తాము మోయలేమని ఎల్ అండ్ టీ వాదిస్తున్నది. ఒప్పందం ప్రకారం జూన్ 30 కటాఫ్ డేట్ అని స్పష్టం చేస్తున్నది. మరోవైపు స్వాధీన ప్రక్రియ పూర్తికాలేదు కాబట్టి, పూర్తిస్థాయిలో యాజమాన్య హక్కులు చేతికి రాకుండా ఆ భారాన్ని నెత్తిన వేసుకొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు తెలిపాయి.
మెట్రో ప్రాజెక్టు వాస్తవ విలువ ఎంత? ఫేజ్-1 బదిలీకి, ఫేజ్-2 విస్తరణకు ఎంతమేర నిధులు అవసరం? వంటి అంశాలను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ క్యాప్స్ను కన్సల్టెంట్గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి కనీసం ఐదు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి. అప్పటివరకు రుణాల మంజూరు, బదిలీ ప్రక్రియ ఆగిపోతుందని వెల్లడించాయి. కాబట్టి ఈ ఐదు నెలలపాటు మెట్రోను ఎవరు నడుపుతారు? రోజువారీ నష్టాలను ఎవరు భరిస్తారు? అనే చర్చ జరుగుతున్నది.
మెట్రో రైలుపై ఢిల్లీ కేంద్రంగా సాగిన పరిణామాలతో ఎల్ అండ్ టీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావుతో ఎల్ అండ్ టీ ఉన్నతాధికారులు వరుసగా సమావేశం అవుతున్నారని తెలిసింది. అనధికారికంగా జరుగుతున్న ఈ భేటీలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. మెట్రో బదిలీ సమయానికి పెండింగ్లో ఉన్న ఆర్థిక లావాదేవీలు, నిర్వహణ, నిధులపై చర్చలు జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బదిలీ ఆలస్యం అవుతున్నకొద్దీ పేరుకుపోతున్న వడ్డీల భారాన్ని ఎవరు భరించాలి? రోజూ వస్తున్న రూ.2.5 కోట్లను ఎవరు చెల్లించాలి? వంటి అంశాలపై సీరియస్గా చర్చ జరిగినట్టు తెలిసింది. అయినా ఇప్పటివరకు స్పష్టత రాలేదని సమాచారం.