నిర్మల్ : రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గురువారం రైతు వ్యతిరేక బీజేపీ విధానాలపై నిర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలో జరుగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమన్నారు.
యూపీలో అధికార బీజేపీ పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీల్లో చేరుతున్నారు. మోదీ రైతు వ్యతిరేక విధానాలపై దేశంలోని రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయని మంత్రి తెలిపారు. ఎరువుల ధరల పెంపు, వ్యవసాయ మోటర్లకు మీటర్ల బిగింపు నిర్ణయాలకు వ్యతిరేకంగా అన్నదాతలు నాగళ్లు ఎత్తాలని పిలుపునిచ్చారు.
రైతులను ముంచాలనుకుంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలి వేయాలి. ఎరువుల ధరల పెంపు పై రాష్ట్ర బీజేపీ నేతలు తమ వైఖరిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను వీడనాడాలన్నారు. కేంద్రం దిగి వచ్చే వరకు రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందన్నారు.
సీఎం కేసీఅర్ పిలుపు మేరకు అన్నదాతలు, ప్రజాప్రతినిధులు గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.