‘తెలుగులో చాలా రోజుల తర్వాత సందర్భోచిత హస్యంతో రూపొందిన నవ్యమైన సినిమా ఇది. చక్కటి ఎమోషన్, థ్రిల్తో పాటు ఆద్యంతం నవ్వులను పంచుతున్నది’ అని అన్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘పుష్పకవిమానం’. దామోదర దర్శకుడు. గీత్సైనీ, శాన్వీమేఘన కథానాయికలుగా నటించారు. గోవర్ధన్రావు దేవరకొండ, ప్రదీప్ ఎర్రబెల్లి, విజయ్ మట్టపల్లి నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం హైదరాబాద్లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ “లైగర్’ సినిమా షూటింగ్ కోసం అన్నయ్య విజయ్ దేవరకొండ అమెరికా వెళ్లారు. అందుకే ఈ సక్సెస్ వేడుకకు రాలేదు. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పట్ల అన్నయ్య ఆనందంగా ఉన్నాడు. కామెడీ ఆకట్టుకుంటున్నదని ప్రేక్షకులు అంటున్నారు’ అని అన్నారు. ‘సమాజంలో జరుగుతున్న సంఘటనల నుంచి స్ఫూర్తి పొందుతూ పెళ్లి నేపథ్యంలో అందమైన కుటుంబకథగా ఈ సినిమాను తెరకెక్కించాం. సందేశంతో పాటు వినోదం బాగుందని అభినందిస్తున్నారు’ అని దర్శకుడు దామోదర తెలిపారు. ఊహించినదాని కంటే ఎక్కువగా తన పాత్రకు థియేటర్లో స్పందన లభిస్తున్నదని శాన్వీ మేఘన చెప్పింది. ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్, గీత్సైని, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.