న్యూఢిల్లీ, జనవరి 6: దేశంలో జనాభా లెక్కల సేకరణ మరింత ఆలస్యం కానున్నది. పదేండ్లకోసారి చేపట్టే ఈ ప్రక్రియ కనీసం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు వాయిదా పడినట్టు అధికారులు వెల్లడించారు. వాస్తవానికి దేశ జనాభా లెక్కల సేకరణ, జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్) సవరణ ప్రక్రియను 2020లోనే ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ వ్యాప్తి వల్ల వాయిదా పడింది. నిబంధనల ప్రకారం జనగణనకు ముందు జిల్లాలు, ఉప జిల్లాలు, తాసీళ్లు, తాలూకాలు, పోలీస్ స్టేషన్లు తదితర ప్రాంతీయ పరిపాలనా విభాగాల సరిహద్దులను స్తంభింపజేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కేవలం మూడు నెలల్లో జనాభా లెక్కలను సేకరించాల్సి ఉంటుంది. గతంలో ప్రాంతీయ సరిహద్దులను స్తంభింపజేయాల్సిన గడువు తేదీని తొలుత 2020 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. ఆ తర్వాత 2021 డిసెంబర్ 31 వరకు, మరోసారి 2022 డిసెంబర్ 31కి వాయిదా పడిన ఈ గడువు తేదీని తాజాగా ఈ ఏడాది జూన్ 30 వరకు పొడిగించినట్టు రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా కార్యాలయం అన్ని రాష్ర్టాలకు తెలియజేసింది.
బీహార్లో నేటి నుంచి కులగణన
బీహార్లో కులాలవారీగా జనగణన శనివారం ప్రారంభంకానున్నది. ఈ జనగణనను రెండు దశల్లో చేపట్టనున్నారు. కులం, ఉప కులం, మతం, ఆర్థిక పరిస్థితి ఇలా పలు వివరాలను ప్రజల నుంచి సేకరిస్తారు. ఈ గణన పూర్తిగా డిజిటల్గా (మొబైల్ అప్లికేషన్ ద్వారా) జరుగనున్నది.