బెంగళూరు: ఐపీఎల్ మెగా వేలంలో శనివారం ఊహించని ఘటన చోటు చేసుకుంది. వేలం పాట సాగుతున్న సమయంలో వెటరన్ ఆక్షనీర్(వేలం వేసే వ్యక్తి) హ్యు ఎడ్మెడ్స్ ఒక్కసారి కుప్పకూలిపోయాడు. శ్రీలంక స్పిన్నర్ వణిందు హసరంగ పేరు చదువుతున్న క్రమంలో ఎడ్మెడ్స్ స్టేజ్ మీదే పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు..ఎడ్మెడ్స్కు తక్షణ వైద్య సహాయం అందజేశారు. రక్తపోటు ఒక్కసారి తగ్గడంతో ఈ 60 ఏండ్ల ఆక్షనీర్ నీరసించి పడిపోయినట్లు ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి. ఎడ్మెడ్స్ అస్వస్థతకు లోనుకావడంతో వేలం పాటకు కొద్దిసేపు అంతరాయం కల్గింది. ఎడ్మెడ్స్ స్థానంలో ప్రముఖ వ్యాఖ్యాత చారుశర్మ మిగిలిన కార్యక్రమాన్ని పూర్తి చేశాడు.