‘క్రాక్’ ‘నాంది’ చిత్రాల్లో తెలుగు ప్రేక్షకుల్ని చక్కటి అభినయంతో మెప్పించింది వరలక్ష్మి శరత్కుమార్. దక్షిణాదిన ఆమెకు మంచి అవకాశాలొస్తున్నాయి. వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘శబరి’ సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. ముహూర్తపు సన్నివేశానికి సతీష్ వేగేశ్న క్లాప్నివ్వగా, దర్శకుడు మదన్ కెమెరా స్విఛాన్ చేశారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. వరలక్ష్మి శరత్కుమార్ మునుపెన్నడూ చూడని కొత్త పాత్రలో కనిపిస్తుంది’ అని చెప్పారు. ఈ నెల 11 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని..హైదరాబాద్, విశాఖ, కొడైకెనాల్ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుతామని నిర్మాత తెలిపారు. గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:నాని, సంగీతం: గోపీ సుందర్, ఆర్ట్: ఆశిష్తేజ, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సీతారామరాజు మల్లెల, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: అనిల్ కాట్జ్.