బ్యాంకాక్ : థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో నాలుగో ర్యాంకర్స్ సాత్విక్-చిరాగ్ 21-19, 21-23, 21-10తో ముహ్ పుత్రా ఎరవిన్సియా-బగస్ మౌలానా (ఇండోనేషియా) జోడీపై గెలిచారు.
64 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో తొలి గేమ్లో 11-16తో వెనుకబడ్డా ఆ తర్వాత వరుసగా ఏడు పాయింట్లు సాధించిన సాత్విక్ జోడీ ఆ గేమ్ను సొంతం చేసుకుంది. నువ్వానేనా అన్నట్టుగా సాగిన రెండో గేమ్లో 14-17తో వెనుకంజలో ఉండి తర్వాత పుంజుకున్నా ఇండోనేషియా షట్లర్లు పట్టు విడువకుండా ప్రయత్నించి సఫలమయ్యారు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో మాత్రం భారత జంట బ్రేక్కు ముందే 11-5తో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. అదే జోరుతో మ్యాచ్ గెలిచి టోర్నీలో ముందంజ వేసింది.