హైదరాబాద్ : సామాజిక బాధ్యతలో భాగంగా నేత్రదానానికి టీజీఎస్ఆర్టీసీ తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన నేత్రాలను ఉచితంగా తమ బస్సుల్లో హైదరాబాద్కు తరలించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ‘నెట్వర్క్ టు సైట్’ పేరుతో సరోజిని దేవి కంటి ఆస్పత్రితో టీజీఎస్ఆర్టీసీ ఒక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ మెహిదిపట్నంలోని సరోజిని దేవి కంటి ఆస్పత్రి ప్రాంగణంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు.
ఈ ఒప్పందం ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నేత్రదాతల నుంచి సేకరించిన కార్నియాలను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా హైదరాబాద్కు పంపిస్తారు. సేకరించిన కార్నియాలను ఐస్ బాక్స్లో భద్రపరిచి ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో వైద్య సిబ్బంది అందజేస్తారు. వాటిని తమ బస్సుల్లో హైదరాబాద్కు ఆర్టీసీ డ్రైవర్లు తీసుకువస్తారు. బస్సులు హైదరాబాద్ చేరుకోగానే సరోజిని కంటి ఆసుపత్రి సిబ్బంది వచ్చి వాటిని తీసుకుని ఐ బ్యాంక్లలో భద్రపరుస్తారు.
టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. పవిత్రమైన ఈ దాతృత్వ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని అన్నారు. ‘నెట్వర్క్ టు సైట్’ పై ఆర్టీసీ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. వ్యక్తి మృతిచెందిన తర్వాత అత్యంత విలువైన అవయవాలను వృథా చేయడం కంటే అంధత్వంతో లోకాన్ని చూడలేని వారికి చూపునీయడం గొప్ప కార్యమని అన్నారు. భారతదేశంలో ప్రతి ఏటా 3 లక్షలకు పైగా మంది నేత్రాల కోసం ఎదురుచూస్తుంటే.. కేవలం 18 వేల మార్పిడిలు మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు. మరణానంతరం నేత్రదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సరోజిని దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని మాట్లాడుతూ.. కార్నియాలను బస్సుల్లో ఉచితంగా తరలించేందుకు ముందుకు వచ్చిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా కార్నియాలను సరోజిని కంటి ఆస్పత్రికి తీసుకువచ్చి అవసరమైన వారికి మార్పిడి చేస్తామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నేత్రదాన ప్రతిజ్ఞ చేశారు. నేత్రదాన ప్రతిజ్ఞా పత్రంపై సంతకం చేసి సరోజిని దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదినికి అందజేశారు.
అంతకుముందు నేత్రదానంలో కీలకపాత్ర పోషిస్తోన్న జీవన్దాన్ కోఆర్డినేటర్లు రియాజుద్దీన్, విశ్వరలింగం, అరుణ, శ్రీలతలను సన్మానించారు. ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు కార్నియాలను తరలించే ఐస్ బాక్స్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు, ఎన్పీసీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కళావతి, ప్రభుత్వ ఆస్పత్రి సిద్దిపేట సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత తదితరులు పాల్గొన్నారు.