హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు మరో ప్రపంచ ఖ్యాతి దక్కింది. నిన్న ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రామప్ప గుర్తింపు పొందగా, నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకున్నది. ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్డబ్ల్యూటీవో) ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామంగా పోచంపల్లికి మంగళవారం గుర్తింపునిచ్చింది. దీంతో తెలంగాణ పర్యాటక కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరినట్టు అయ్యింది.
డిసెంబర్ 2న స్పెయిన్లోని మాడ్రిడ్లో నిర్వహించే యూఎన్డబ్ల్యూటీవో జనరల్ అసెంబ్లీ 24వ సెషన్లో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రదానం చేయనున్నారు. యూఎన్డబ్ల్యూటీవో బెస్ట్ టూరిజం విలేజ్ ఎంట్రీకి భారత్ నుంచి భూదాన్ పోచంపల్లితోపాటు మేఘాలయలోని కాంగ్థాన్, మధ్యప్రదేశ్లోని టికంగఢ్ జిల్లా ఓర్చా తాసిల్లోని లద్పూరాఖాన్ గ్రామాలను కేంద్రం సిఫార్సు చేసింది. ఈ మూడింటిలో భూదాన్ పోచంపల్లికి మాత్రమే గుర్తింపునిస్తున్నట్టు యూఎన్డబ్ల్యూటీవో ప్రకటించింది. దీంతో దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి గ్రామంగా పోచంపల్లి చరిత్రకెక్కింది.
మహాత్మాగాంధీ శిష్యుడైన ఆచార్య వినోబాభావే 9151లో భూదాన్ ఉద్యమాన్ని ఇక్కడ ప్రారంభించడంతో ఈ ప్రాంతానికి భూదాన్ పోచంపల్లి అనే పేరు వచ్చింది. పోచంపల్లిలో అగ్గిపెట్టలో ఇమిడే ఆరుగజాల చీరను నేసి ప్రత్యేకతను చాటడంతోపాటు నాటి నిజాం సహా అరబ్ దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలు ఎగుమతి చేసింది. కళాకారుల ప్రతిభ ఆధారంగా ‘స్కిల్ సిటీ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకున్నది. పోచంపల్లి చేనేత కళాకారులు నేసే అనేక రకాల ఇక్కత్ వస్ర్తాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్నది.
హైదరాబాద్కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం, మూసీ నది పరీవాహక ప్రాంతం కావడం.. ఎటు చూసినా పచ్చని పంట పొలాలతో కోనసీమను తలపించే అందాలు, నిండుకుండలా ఉండే చెరువులు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ప్రపంచ అత్యుత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు పొందడంతో పోచంపల్లి ఖ్యాతి ప్రపంచస్థాయిలో మార్మోగనున్నది.
భూదాన్ పోచంపల్లికి ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు లభించడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూఎన్డబ్ల్యూటీవో.. పోచంపల్లిని ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపిక చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం దిశ గా స్వయం పాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ఫలితంగా, చారిత్రక పర్యాటక ప్రాంతాలు అంతర్జాతీయ గుర్తింపును పొందుతున్నాయని తెలిపారు.
అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు సాధించిన పోచంపల్లి ప్రజలకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. రామప్ప ఇటీవలే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడం, ఇప్పుడు పోచంపల్లి బెస్ట్ టూరిజం విలేజ్గా ఎంపికవడం పర్యాటక రంగానికి ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. ఈ గుర్తింపుతో అక్కడ నేసే ఇక్కత్ చీరలకు అంతర్జాతీయంగా మరింత గుర్తింపు లభిస్తుందని తెలిపారు.
తెలంగాణ పర్యాటక రంగానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో మహర్దశ పట్టిందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఇకపై పర్యాటకుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా స్పందిస్తూ.. భూదాన్ పోచంపల్లి ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికవడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు.