నిజామాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో రెండు నెలలుగా దుమా రం రేపుతున్న ఔట్ సోర్సింగ్ అక్రమ నియామకాల అంశానికి తెరపడింది. 113 మంది నియామకాలను రద్దు చేస్తూ వైస్ చాన్స్లర్ రవీందర్గుప్తా, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సంయుక్తంగా ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో శనివారం పాలక మండలి సమావేశం జరిగింది. యూనివర్సిటీలో కొద్దిరోజులుగా వివాదాస్పదం అవుతున్న నియామకాల అంశంతోపాటు వీసీ, ఇన్చార్జి రిజిస్ట్రార్ పనితీరుపై చర్చించారు. పాలకమండలి సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి వీసీ, ఇన్చార్జి రిజిస్ట్రార్ తీరుపై మండిపడ్డారు. అక్రమ నియామకాలపైనా నిలదీశారు. యూనివర్సిటీలో అక్రమంగా నియామకమై రోజువారీగా విధులకు హాజరవుతున్న సిబ్బంది వివరాలను, వారి హాజరు పట్టిక గురించి ప్రస్తావించారు. అనంతరం ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కనకయ్యను బాధ్యతల నుంచి తప్పించారు. నూతన రిజిస్ట్రార్గా కామర్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ యాదగిరిని నియమించారు.