హైదరాబాద్ : జేఈఈ మెయిన్ (JEE Main) మొదటి విడుత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇవాళ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు తమ సత్తా చాటారు. పేపర్ -1లో తెలంగాణకు చెందిన జాస్తి యశ్వంత్ వీవీఎస్ టాపర్గా నిలిచాడు. ఇక యశ్వంత్ తో పాటు తెలంగాణకు చెందిన ధీరజ్ కురుకుంద, అనికేత్ ఛటోపాధ్యాయ్, రూపేశ్ బియానీ కూడా వంద పర్సంటైల్ సాధించారు. ఏపీ విద్యార్థులు పెనికలపాటి రవి కిశోర్, పొలిశెట్టి కార్తీకేయ, కే సుహాస్ కూడా వంద పర్సంటైల్ సాధించారు. వంద పర్సంటైల్ సాధించిన తెలుగు విద్యార్థులకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.
జేఈఈ మెయిన్ పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు ఎన్టీఏ నిర్వహించింది. ఈ నెల 6న ఫైనల్ కీని విడుదల చేసింది. తాజాగా ఫలితాలను అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in, nta.ac.in, ntaresults.nic.in లో అందుబాటులో ఉంచింది. అయితే ప్రస్తుతానికి జేఈఈ మెయిన్ పేపర్-1 (బీఈ, బీటెక్) సంబంధించిన ఫలితాలను మాత్రమే విడుదల చేసింది. పేపర్-2 (బీఆర్క్, బీ ప్లానింగ్) ఫలితాలు విడుదలవ్వాల్సి ఉన్నది. ఈఏడాది రాష్ట్రం నుంచి 50 వేలకుపైగా విద్యార్థులు మొదటి విడుత పరీక్షలకు హాజరయ్యారు.