హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర రాబడులను పెంచడంలో ఘోరంగా విఫలమై అప్పులతో పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఈ రుణాన్ని సమీకరించినట్టు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించింది. ఇందులో ఏడేండ్ల కాల పరిమితితో 7.43% వార్షిక వడ్డీకి రూ.750 కోట్లు, 11 ఏండ్ల కాల పరిమితితో 7.63% వడ్డీకి రూ.500 కోట్లు, 21 ఏండ్ల కాలపరిమితితో 7.79% వడ్డీకి రూ.750 కోట్లు తీసుకున్నట్టు వెల్లడించింది.
ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో మొత్తం రూ.18,900 కోట్ల రుణాలు సమీకరిస్తామని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏప్రిల్లో రూ.6,900 కోట్లు, మే నెలలో రూ.6 వేల కోట్లు, జూన్ 2న రూ.4 వేల కోట్ల అప్పులు తీసుకున్నది. తాజాగా మరో రూ.2 వేల కోట్ల అప్పు తీసుకోవడంతో తొలి త్రైమాసికంలో ఆర్బీఐ నుంచి సమీకరించాలనుకున్న రూ.18,900 కోట్ల రుణాలు పూర్తయ్యాయి. ఈ లెక్కన రేవంత్రెడ్డి సర్కార్ ప్రతినెలా రూ.6 వేల కోట్లకుపైగా అప్పులు చేస్తున్నట్టు స్పష్టమవుతున్నది.