హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ)/ ఖైరతాబాద్: తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి (74) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. గత నెల 19న దవాఖానలో చేరిన చిరంజీవికి వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయన మరణించారు. ఆయనకు భార్య డాక్టర్ చంద్రావతి, కుమార్తె అజిత ఉన్నా రు.
చిరంజీవి మృతిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తంచేశా రు. కొద్ది రోజుల క్రితం చిరంజీవి చికిత్స ఖర్చును కుటుంబసభ్యులు భరించలేని స్థితిలో ఉన్నారని తెలుసుకొన్న సీఎం కేసీఆర్ తక్షణమే రూ.10లక్షలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కేటీఆర్ వైద్యులను కోరారు. చిరంజీవి మరణ వార్త తెలియడంతో మంత్రులు కేటీఆర్, ఈటల సోమవారం ఆయన నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎంపీ బండా ప్రకాశ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రజా గాయకుడు గద్దర్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిరంజీవికి నివాళు లు అర్పించినవారిలో ఉన్నారు.
తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి మరణంపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివి వైద్యుడిగా సమాజం కోసం బతికిన చిరంజీవి జీవితం ఆదర్శనీయమని కొనియాడారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
1947లో వరంగల్లో కొల్లూరి చిరంజీవి జన్మించారు. కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. ఆ సమయంలోనే విద్యార్థి సంఘం నేతగా చురుకుగా పనిచేశారు. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. పీపుల్స్వార్ గ్రూప్లో చేరి కొండపల్లి సీతారామయ్యకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. 1977లో పార్టీనుంచి బయటకు వచ్చి కాన్షీరాం నేతృ త్వంలోని బీఎస్పీలో చేరారు.