వరంగల్, మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఝూటా మాటలు మాట్లాడుతూ తొండి సంజయ్లా వ్యవహరిస్తున్నారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకంపై సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన మాటలతో బీజేపీ ‘బడా ఝూటా పార్టీ’ అని స్పష్టమవుతున్నదని మండిపడ్డారు. ఉపాధి పథకం అమలుపై తనిఖీలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్పష్టంచేశారు.
మంగళవారం హనుమకొండలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణితో కలిసి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి ఝూటా మాటలతో గట్టెకుదామని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఉపాధి హామీ అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్టు కేంద్రం నివేదికలే చెప్తున్నాయని పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ఉపాధిహామీ పథకం అమలులో చేసిన మార్పుల గురించి ఆ పార్టీ ఎంపీగా ఉన్న సంజయ్కి తెలియదా? అని ప్రశ్నించారు. కేంద్రం ఇప్పుడు నేరుగా గ్రామపంచాయతీలకు ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆపుతున్నట్టు సంజయ్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉపాధి హామీలో అవకతవకలు జరుగుతున్నాయని తెలంగాణ బీజేపీ ఎంపీల ఫిర్యాదు మేరకు రాష్ట్రంలో తనిఖీలు నిర్వహించిన కేంద్ర అధికారులు.. తెలంగాణలో ఉపాధి హామీ పథకం చాలా చక్కగా అమలవుతున్నదని ప్రశంసించారని గుర్తు చేశారు. ఉపాధిహామీ నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటాను రెండు వారాల్లో చెల్లిస్తున్నామని, కేంద్రం మాత్రం తన వాటా చెల్లించకుండా జాప్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం నుంచి రాష్ర్టానికి 230 కోట్ల లేబర్ కాంపోనెంట్ నిధులు రావాల్సి ఉన్నదని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఉపాధి హామీ పనిదినాలు, నిధుల్లో కేంద్రం భారీగా కోతలు పెట్టిందని తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో తెలంగాణలోని ప్రతి గ్రామం ఆదర్శనీయంగా మారిందని చెప్పారు. దేశంలోని 20 ఉత్తమ గ్రామపంచాయతీలతో కేంద్రం రూపొందించిన జాబితాలో 19 గ్రామాలు తెలంగాణకు చెందినవేనని గుర్తు చేశారు. ప్రధాని మోదీ సహా బీజేపీ ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల్లో ఒక్కటి కూడా ఈ జాబితాలో లేదని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ విజయాలకు గుర్తింపుగా కేంద్రం ఇప్పటికే పలు అవార్డులు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోని బండి సంజయ్ కనీసం తను ఎంపీగా ఉన్న కరీంనగర్కు మెడికల్ కాలేజీ తెచ్చుకోలేకపోయారని విమర్శించారు. తన పాదయాత్రలో టోల్గేట్ల వద్దకు, పెట్రోలు బంకుల వద్దకు వెళ్లి అక్కడ ఉన్న చార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలను తెలుసుకోవాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదని చెప్పారు.