హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బడి పిల్లల హాజరుశాతం జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉన్నది. ముఖ్యంగా ప్రాథమికోన్నత, సెకండరీ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా మెరుగయ్యింది. విద్యార్థుల నమోదులోను తెలంగాణ జాతీయ సగటు కన్నా ఉత్తమ స్థానంలో ఉన్నది. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) అధ్యయనంలో వెల్లడయ్యాయి. ‘క్వాలిటీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ’ పేరుతో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్)లోని రిసెర్చ్ సెల్ ఆన్ ఎడ్యుకేషన్ ఈ అధ్యయాన్ని నిర్వహించింది. 2017-18 విద్యా సంవత్సరంలోని విద్యా ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకొని నివేదికను రూపొందించింది.
6-14 ఏండ్ల వయస్సు విద్యార్థుల హాజరుశాతం విషయంలో హిమాచల్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ మొదటి ఐదుస్థానాల్లో ఉన్నాయి. 15-17 ఏజ్ గ్రూప్ విద్యార్థుల హాజరులో తెలంగాణ 88.3 శాతంతో 10వ స్థానంలో ఉండగా, 6-17 ఏజ్ గ్రూప్ విద్యార్థుల హాజరులో 95.7 శాతంతో 8వ స్థానంలో ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో 6-14 మధ్య వయస్సు పిల్లలు 98.5 శాతం, 15-17 మధ్య వయస్కులు 87.5 శాతం చొప్పున తరగతులకు హాజరవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో ఒక్క ఎస్టీలు మినహా మిగతా అన్ని వర్గాలకు చెందిన విద్యార్థుల హాజరుశాతం ఆశాజనకంగా ఉన్నది.