కొత్తూరు/కొత్తూరు రూరల్ : తెలంగాణను రైతు రాజ్యంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్నర్వలో బుధవారం మంత్రి నిరంజన్రెడ్డి రైతు వేదికను ప్రారంభిచారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 4కోట్ల మంది జనాభా ఉందని, ఇంత మందికి ఉపాధి కల్పించాలంటే కేవలం వ్యవసాయ రంగం ధ్వారనే సాధ్యమవుతుందన్నారు. అందుకే సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.
రెండు సీజన్లలో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రం పండించిందన్నారు. ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా పంజాబ్ ఉండేదని నేడు ఆ స్థానాన్ని తెలంగాణ దక్కించుకుందని తెలిపారు. దాని వెనుక సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉందన్నారు. రైతు వేదికకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని స్పష్టం చేశారు. రైతులు విత్తనం వేసినప్పటి నుంచి పండించిన పంటకు మద్దతు ధర తెచ్చుకునే వరకు ప్రతి విషయంలో రైతు వేదికలు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. రైతుకు కావాల్సిన అన్ని సౌకర్యాలకు రైతు వేదికలు ఒక వారధిలా పనిచేస్తాయని వివరించారు. రైతులకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు వేదికల ద్వారా అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 2601 రైతు వేదికలను నిర్మించామన్నారు. నిర్మాణమైన చాలా రైతు వేదికల్లో ఇప్పటికే రైతులకు శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. ఏడీలు, ఈవోలు, ఏఈవోలు రైతులను రైతు వేదికలకు రప్పించి వారికి ఉపయోగపడే సమాచారన్ని శిక్షణ ద్వారా ఇస్తున్నారన్నారు.
ఈ రైతు వేదికలో కూడా అలాంటి శిక్షణ ఉంటుందన్నారు. చేనే పనిలో సంపూర్ణ అవగాహన కలిగి ఉంటే అందులో అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. వ్యవసాయం అనేది వారసత్వంగా, మొక్కుబడిగా కాకుండా సంపూర్ణ అవగాహతో చేస్తే అధిక లాభాలు ఆర్జించవచ్చన్నారు. వ్యవసాయంపై సంపూర్ణ అవగాహన కల్పించడానికి రైతు వేదికలను ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు. రైతు వేదికల ద్వారా చేసే మరో ముఖ్యమైన పని రైతులను సంఘటిత పర్చడం అన్నారు. ఒక రైతుగా కేసీఆర్ రైతుకు కావాల్సిన కరెంటు నీళ్లు, పెట్టుబడి, బీమా, వ్యవసాయ అధికారులు, రైతు వేదికలు ఇలా అన్ని వసతులు కల్పిస్తున్నారన్నారు. వ్యవసాయ రంగానికి ఒక ఏడాదికి రూ. 60వేల కోట్లు ఖర్చుపెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతు కుటంబాలకు రైతు బీమా చెక్కులు అందజేశారు.
ప్రతి గుంటకు సాగునీరు అందిస్తాం : ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా సాగునీరు అందించినట్లుగానే ప్రతి గుంటకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తెలిపారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో అద్భుత పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా షాద్నగర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.
రైతులకు వ్యవసాయంలో అధిక లాభాలు ఆర్జించడానికే రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్రెడ్డి, సురభి వాణీదేవి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, జడ్పీటీసీ శ్రీలత సత్యనారాయణ, వైస్ ఎంపీపీ శోభ, ఎంపీడీవో జ్యోతి, సర్పంచ్ అజయ్నాయక్, ఏవో గోపాల్, ఏఈవోలు దీపిక, సన పాల్గొన్నారు.