Sai varshith | అమెరికా అధ్యక్షుడై దేశాన్ని పాలించడమే అతడి ఏకైక లక్ష్యం. దీనికోసం ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లలో పాల్గొని అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకోలేదు అతను. ఏకంగా వైట్హౌస్పైనే దాడి చేసి అధ్యక్షుడు బైడెన్ను చంపేయాలనుకొన్నాడు. సోమవారం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడికి యత్నించిన నిందితుడు కందుల సాయివర్షిత్ కేసులో బయటపడుతున్న నిజాలు సంచలనంగా మారాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం వద్ద సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. అయితే వైట్హౌస్పై దాడే లక్ష్యంగా ఈ ట్రక్కు ట్రాఫిక్ బారియర్స్ను పలుమార్లు ఢీకొట్టినట్టు తాజాగా తేలింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు తెలుగు సంతతికి చెందిన కందుల సాయివర్షిత్ (19)ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతడు చెప్పిన వివరాలు పోలీసులు, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను కూడా షాక్కు గురిచేశాయి.ఆరు నెలలుగా ప్లాన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను హత్య చేయాలనే లక్ష్యంతోనే ఉద్దేశపూర్వకంగా ట్రక్కుతో దాడికి యత్నించినట్టు నిందితుడు సాయివర్షిత్ పోలీసులకు తెలిపాడు.
దీనికోసం ఆరు నెలలుగా పక్కా ప్లాన్ వేసి ఈ దాడికి యత్నించినట్టు వెల్లడించాడు. ఈ మేరకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వర్గాలు మీడియాకు తెలిపాయి. ‘శ్వేతసౌధంలోకి ప్రవేశించి.. అధికారాన్ని కైవసం చేసుకొని అమెరికాకు నేతృత్వం వహించడమే నా లక్ష్యం’ అని వర్షిత్ పోలీసులకు తెలిపాడు. అధికారాన్ని ఎలా దక్కించుకుంటావని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అడగ్గా.. ‘నా ప్రయత్నానికి అడ్డొస్తే, అధ్యక్షుడు బైడెన్నే కాదు.. ఎవర్నైనా చంపేస్తా లేదా గాయపరుస్తా’ అని వర్షిత్ చెప్పినట్టు అధికారులు పేర్కొన్నారు. ‘హిట్లర్ అంటే నాకు ఇష్టం. ఆయనకు నేను ఫ్యాన్. హిట్లర్ ఓ బలమైన నేత. నాజీలకు గొప్ప చరిత్ర ఉంది’ అని వర్షిత్ పేర్కొన్నట్టు తెలిపారు. వైట్హౌస్పై దాడి కేసులో వర్షిత్పై మారణాయుధాల వినియోగం, నిర్లక్ష్య డ్రైవింగ్, అధ్యక్షుడిపై హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.
అసలేం జరిగింది?
సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వైట్హౌస్ సమీపంలో ఓ ట్రక్కు కలకలం సృష్టించింది. భవనం బయటి సైడ్వాక్ నుంచి అడ్డదారిలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు శ్వేతసౌధం ఉత్తరభాగంవైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్ను ఢీకొట్టింది. ఆ తర్వాత రివర్స్ డైరెక్షన్లో వెనక్కి వచ్చి మరోసారి ఢీకొట్టింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రక్కును చుట్టుముట్టి వర్షిత్ను అదుపులోకి తీసుకున్నారు.
అద్దెకు ట్రక్కు
వైట్హౌస్పై దాడికి సంబంధించి ఆరు నెలల నుంచే వర్షిత్ పక్కా ప్లాన్ సిద్ధం చేసుకొన్నట్టు అధికారులు తెలిపారు. ‘యూ-హౌల్’ రెంటల్ కంపెనీ నుంచి ఓ ట్రక్కును అద్దెకు తీసుకొన్నాడు. అనంతరం.. వైట్హౌస్ బయట ఉన్న సైడ్వాక్ వద్దకు ట్రక్కును పోనిచ్చాడు. అనంతరం ట్రాఫిక్ బారియర్స్ను పలుమార్లు ఢీకొట్టాడు. దాడికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తన గ్రీన్బుక్లో నిందితుడు రాసుకొన్నట్టు అధికారులు తెలిపారు. నిందితుడి నుంచి నాజీ జెండాను స్వాధీనం చేసుకొన్నట్టు పేర్కొన్నారు. ఈ జెండాను ఆన్లైన్లో అతడు కొనుగోలు చేసినట్టు వెల్లడించారు.
ఎవరీ సాయివర్షిత్?
మిస్సోరిలోని ఛెస్ట్ఫీల్డ్కు చెందిన సాయి వర్షిత్ది భారత సంతతికి చెందిన కుటుంబం. 2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
అమెరికాను ఏలడమే నా లక్ష్యం.అడ్డొస్తే.. ప్రెసిడెంట్నే కాదు. ఎవర్నైనా చంపిపారేస్తా..అడాల్ఫ్ హిట్లర్ ఓ బలమైన నేత. ఆయనకు నేను వీరాభిమానిని.
– శ్వేతసౌధం దాడి నిందితుడు కందుల సాయివర్షిత్