తమిళ హీరో సూర్య నటించిన సినిమా ‘ఈటీ’ (ఎవరికీ తలవంచడు). ప్రియాంక అరుల్ మోహన్ నాయికగా నటిస్తున్నది. పాండిరాజ్ దర్శకుడు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. తెలుగులో ఏషియన్ మల్టీప్లెక్స్ విడుదల చేస్తున్నది. మార్చి 10న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్లో జరిగింది. ట్రైలర్ విడుదల అనంతరం హీరో సూర్య మాట్లాడుతూ..‘ఈటీ నాకు ప్రత్యేకమైన సినిమా. ప్రేక్షకులు గుర్తుపెట్టుకుని ఇంటికి తీసుకెళ్లే ఎన్నో విషయాలు కథలో ఉన్నాయి. కరోనాను ఎలా ఎదుర్కోవాలో భారతీయ చిత్రపరిశ్రమకు తెలుగు ప్రేక్షకులే చూపించారు. ఆ సమయంలో సినిమాలను ఆదరించి నిలబెట్టారు. నా చిత్రాలు ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ కరోనా సమయంలో విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. సినిమా బాగుంటే హద్దుల్లేని ప్రేమ చూపించే తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. చిరంజీవి స్ఫూర్తితో అగరం ఫౌండేషన్ స్థాపించాను. తొలిబ్యాచ్ 5వేల మంది పిల్లలు ఇప్పుడు కళాశాలకు వెళ్లడం సంతృప్తిగా ఉంది’ అన్నారు. ‘మనకున్న హీరోల్లో సూర్యది ప్రత్యేక శైలి. ఆయన ఎంచుకునే చిత్రాలు భిన్నంగా ఉంటాయి. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలు ఓటీటీలో మంచి ఆదరణ పొందాయి. ఈ సినిమా కూడా విజయం సాధించాలి’ అన్నారు నిర్మాత దిల్ రాజు. ఈ కార్యక్రమంలో హీరో రానా, దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, నిర్మాతలు సురేష్ బాబు, జ్ఞానవేల్ రాజా, రామ్ లక్ష్మణ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.