పక్కపక్కనే ఉన్నా రెండు బావుల్లోని నీళ్ల రుచులు వేరువేరుగా ఉంటాయి. ఇరుగుపొరుగే అయినా తమిళ వంటలకు, తెలుగు విందులకు ఎంతో తేడా. ద్రవిడ దేశపు సాంబారు ఇడ్లీ ఎంత నచ్చినా, రోజూ తింటే బోరే. మామిడికాయ తొక్కు మీదా, కారం పొడులూ, కజ్జికాయల మీదా ప్రాణం లాగుతూనే ఉంటుంది. చెన్నైలో స్థిరపడిన తెలుగువాళ్లకు ఆ లోటు ఏమాత్రం తెలియకుండా చేస్తున్నారు ‘ఆంధ్రా డెలికసీ’ యజమాని సౌజన్య ధనాల. తమ తెలుగు రుచుల విశేషాల్ని ‘జిందగీ’తో పంచుకున్నారిలా…
తరాల క్రితమే చెన్నైలో స్థిరపడిన తెలుగువాళ్లం మేం. మా వారిది కర్నూలు జిల్లా బనగానపల్లె. ఆయన ఇక్కడే ఐటీలో ఉద్యోగం చేస్తారు. నిల్వ పచ్చళ్లు పెట్టడంలో, పొడులు చేయడంలో చేయితిరిగిన మనిషి మా అత్తగారు. మా కోసం రకరకాల పదార్థాలు చేసి పంపేవారు. వాటిని మేం తినడమే కాదు, చుట్టుపక్కల వాళ్లకూ పంచేవాళ్లం. వాళ్లంతా ఆ రుచిని ఎంతగానో మెచ్చుకునేవారు. నేను న్యూజిలాండ్లో ఎంబీఏ చేశాను. గతంలో ఓ ఐటీ కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసేదాన్ని. పని ఒత్తిళ్లు, వృత్తి పట్ల అసంతృప్తి కారణంగా.. రెండేళ్లకన్నా ఎక్కువ కాలం కొనసాగలేక పోయాను. ఉద్యోగానికి స్వస్తి పలికాను. తొలినుంచీ నాకు సొంతంగా వ్యాపారం చేయాలని ఉండేది. దాంతో మా అత్తగారు పంపే పచ్చళ్లు, పొడులు, పిండివంటలను ఓ బ్రాండ్ కింద అమ్మితే ఎలా ఉంటుంది? అనిపించింది. ఆయనకూ ఐడియా నచ్చడంతో అత్తగారితో మాట్లాడాం. ఆవిడ కూడా ఉత్సాహం చూపారు. అలా, 2017లో ‘ఆంధ్రా డెలికసీ’ ప్రారంభించాం.
నలుగురికీ తెలిసేలా ఒక బ్రాండ్ సృష్టించడంలోనే ఏ వ్యాపార విజయమైనా దాగి ఉంటుంది. అందుకే తొలి రోజుల్లో ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా మా ఉత్పత్తులతో వెళ్లేవాళ్లం. సింగపూర్ వరకూ తీసుకెళ్లాం. ఇంకా కావాలంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చని చెప్పేవాళ్లం. అయితే, దీనివల్ల్ల పదార్థాలు బాగా వృథా అయ్యేవి. ఒకసారి పాతిక కేజీల దాకా పచ్చడి మిగిలిపోయింది. అనాథా
శ్రమంలో ఇచ్చాం. తర్వాత నుంచి ఇన్స్టా, ఫేస్బుక్లాంటి వేదికల ద్వారా ప్రకటనలు చేశాం. ఆ ప్రచారం విజయవంతమైంది. మా సంస్థ ద్వారా ఆవకాయ, గోంగూర, ఉసిరికాయ పచ్చళ్లతో పాటు.. పప్పుల పొడి, నల్లకారం, గవ్వలు, పూత రేకులు, హల్వా లాంటివి అమ్ముతున్నాం. వెబ్సైట్లో వీటి వివరాలు ఉన్నాయి. అవి కాకుండా వంకాయ, చిక్కుడుకాయ, క్యాలీ ఫ్లవర్ తదితర కూరగాయలతోనూ నిల్వ పచ్చళ్లు పెడతాం. నెలకు కనీసం పాతిక కిలోల పచ్చళ్లు విక్రయిస్తాం. అన్నీ కలిపి లక్షా లక్షన్నర దాకా అమ్మకాలు జరుగుతాయి. కృష్ణాష్టమి, దసరా, దీపావళిలాంటి పండుగలప్పుడు విభిన్న రకాల స్వీట్ల కలగలుపుగా మేం అందించే స్పెషల్ ప్యాక్లు చాలా మందికి నచ్చు తున్నాయి. అమెరికా, దుబాయ్, సౌతాఫ్రికాలాంటి చాలా దేశాలకూ పార్సిల్స్ పంపుతున్నాం. ప్రస్తుతం ఉన్న మా స్టోర్ను మరింత పెద్దది చేసి సాయంత్రాలు పునుగులు, మిర్చీబజ్జి, ఉగ్గాణి లాంటివి అమ్మాలనుకుంటున్నాం. చెన్నపట్నం ప్రజలకు మరిన్ని తెలుగు రుచులను అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ‘మీ మిఠాయిలు రుచి చేసిన ప్రతిసారీ సొంతూరికి వెళ్లిన భావన కలుగుతుంది’ అంటుంటారు చాలామంది.