కోల్కతా, మార్చి 28: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం రణరంగాన్ని తలపించింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ ఎమ్మెల్యేల మధ్య మొదలైన వివాదం.. తీవ్రరూపం దాల్చి ముష్టిఘాతాలు కురిపించుకొనే వరకు వెళ్లింది. బీర్భూమ్ జిల్లాలో గతవారం జరిగిన హింసాత్మక ఘటనలో 9 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చర్చకు పట్టుబట్టిన బీజేపీ నాయకులు.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఘటనపై సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. బీజేపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలను తృణమూల్ నేతలు అడ్డుకొన్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు సీట్ల నుంచి లేచి గొడవకు దిగారు. ఇది కాస్త ఉద్రిక్తంగా మారి.. పరస్పర దాడుల వరకు వెళ్లింది.
ఈ ఘటనలో ఇరుపార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయి. ఘటన అనంతరం బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బీజేపీ శాసనసభ పక్షనేత సువేందు అధికారి సహా ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. మార్చి 21న బీర్భూమ్ జిల్లాలో టీఎంసీ నేత భాదు షేక్ హత్య జరిగింది. ఘటన జరిగిన కొద్దిగంటలకే బోగ్టూయి గ్రామంలో హింస చెలరేగింది. ఈ అల్లర్లలో ఎనిమిది ఇండ్లను తగులబెట్టారు. ఈ ఘటనలో 9 మంది సజీవ దహనమయ్యారు. షేక్ హత్యతో ప్రత్యర్థుల ఇండ్లకు టీఎంసీ కార్యకర్తలే నిప్పుపెట్టినట్టు విపక్షాలు ఆరోపించాయి. కేసును విచారించిన కలకత్తా హైకోర్టు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. టీఎంసీ నేత సహా 22 మందిని ఇప్పటివరకు పోలీసులు అరెస్టు చేశారు.
గందరగోళం సృష్టిస్తున్న బీజేపీ
తృణమూల్ నేతల దాడిలో చీఫ్ విప్ మనోజ్ టిగ్గా సహా కనీసం 8-10 మంది తమ ఎమ్మెల్యేలు గాయపడ్డారని సువేందు అధికారి తెలిపారు. బీజేపీ నేతల దాడిలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా గాయపడ్డారని మంత్రి ఫిర్హాద్ హకీమ్ పేర్కొన్నారు. అసెంబ్లీలో గందరగోళాన్ని సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదన్న ఆయన.. ఆ పార్టీ నేతల ప్రవర్తనను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.