ఉన్నత విద్యా వ్యాప్తే లక్ష్యంగా ఏర్పాటైన నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పదిహేను ఏండ్లుగా మారుతున్న కాలానికి అనుగుణంగా అడుగులు వేస్తూ పరిశోధనలకు వేదికగా మారింది. ఇతర యూనివర్సిటీలకు దీటుగా పీహెచ్డీ నోటిఫికేషన్స్ ఇవ్వడంతో ముగ్గురు విద్యార్థులు పీహెచ్డీ(డాక్టరేట్) కైవసం చేసుకున్నారు. ఆగస్టు 2019లో కెమిస్ట్రీ విభాగంలో ఒకరు, తాజాగా ఈ నెల 7న మరో ఇద్దరు పరిశోధన బిజినెస్ మెనేజ్మెంట్ విభాగంలో పీహెడ్డీ అందుకున్నారు.
న్యాక్ గ్రేడ్ పెంపులో పరిశోధనలే కీలకం
విద్యా ప్రమాణాలకు నేషనల్ అస్సెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) గుర్తింపులో యూనివర్సిటీల్లోని పరిశోధనలు, పీహెచ్డీ అవార్డుల ప్రదానోత్సవానికి ప్రధాన గుర్తింపు ఉంటుంది. ఎంజీయూలో పీహెచ్డీ అవార్డులను అందించడంతో తర్వలో జరిగే న్యాక్లో ప్రత్యేక మార్కులు లభించే అవకాశం ఉంది.
పీహెచ్డీ విద్యార్థులు వీరే..
ఆగస్టు 2019లో నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం నీలాయిగూడేనికి చెందిన కుందెనపల్లి రామలింగం కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దోమల రమేశ్ పర్యవేక్షణలో మహాత్మాగాంధీ యూనివర్సిటీలో తొలి పీహెచ్డీ సాధించారు. తాజాగా బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో 2017లో అడ్మిషన్ పొందిన ఎం.జాన్పాల్ ఎంజీయూ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అల్వాల రవి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. కామారెడ్డి జిల్లాకు చెందిన డి.సంతోష్కుమార్ ఇదే విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మిర్యాల రమేశ్కుమార్ పర్యవేక్షణలో పరిశోధన చేశారు. వీరిద్దరూ తమ పరిశోధన పత్రాలను ఎంజీయూకు సమర్పించారు. దీంతో ఈ నెల 5న నిపుణుల కమిటీ బృందం వారికి యూనివర్సిటీలో ఇంటర్వ్యూ (Ph.D Viva Voce Presentation) నిర్వహించింది. ఉత్తమ ప్రతిభ చూపడంతో పరిశోధన పత్రాలపై సంతృప్తి వ్యక్తం చేసిన కమిటీ ఉతీర్ణులైనట్లు ఆమోదం తెలిపింది. ఈ నెల 7న వారికి పీహెచ్డీ డాక్టరేట్ ప్రకటిస్తూ ఎంజీయూ పరీక్షల విభాగం సీఓఈ డాక్టర్ మిర్యాల కుమార్ ప్రకటించారు. ముగ్గురు పరిశోధన విద్యార్థులు ఎంజీయూ నుంచి బయటికి రావడంతో ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు.
అంచెలంచెలుగా..
నల్లగొండ జిల్లా కేంద్రంలో 2007లో పురుడు పోసుకున్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ అంచెలంచెలుగా వివిధ కోర్సులతోపాటు మౌలిక వసతులను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో నిధుల లేమితో సౌకర్యాల కొరత ఉండగా స్వరాష్ట్రంలో అవన్నీ సమకూరుతున్నాయి. ఈ నేపథ్యంలో పీహెచ్డీ నోటిఫికేషన్స్ జారీ చేయడంతో వివిధ సబ్జెక్టుల్లో పరిశోధనలకు వేదికగా మారింది. నెట్, సెట్ అర్హత కల్గిన అభ్యర్థులు పీహెచ్డీలో చేరారు. నిర్ణీత సమయంలోనే గైడ్స్ పర్యవేక్షణలో పరిశోధనా పత్రాలను ఆయా విభాగాలకు సమర్పించడంతో నిపుణుల కమిటీ ఆమోదంతో పీహెచ్డీ (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ)ని పరీక్షల విభాగం అధికారులు ప్రకటించారు. అలాగే వివిధ డిపార్ట్మెంట్స్లో ఇంకా 16మంది పరిశోధన విద్యార్థులు ఉన్నారు.
కామారెడ్డి వాసికి బిజినెస్మేనేజ్మెంట్లో
కామారెడ్డి జిల్లా వాసి, ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్ కర్నాటక, కేరళ రాష్ర్టాల జనరల్ మేనేజర్(జీఎం)గా పని చేస్తున్న డి.సంతోష్కుమార్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సాధించారు. నెట్ అర్హతతో 2017లో పీహెచ్డీ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకొని సీటు సాధించారు. ఫిబ్రవరి 14, 2018లో ఎంజీయూ డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మిర్యాల రమేశ్కుమార్ వద్ద పరిశోధన విద్యార్థిగా చేరారు. “ఎ స్టడీ ఆఫ్ హోమ్లోన్ పోర్ట్ఫోలియో ఆఫ్ సెలెక్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఇన్ తెలంగాణ’ అనే అంశంపై సంతోష్కుమార్ పరిశోధన చేసి పత్రాలు సమర్పించారు. తెలంగాణలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో గృహ రుణాలపై అధ్యయనం చేసినందుకు ఈ నెల 5న పీహెచ్డీ వైవా ప్రజెంటేషన్ నిర్వహించగా ఈ నెల 7న డాక్టరేట్ ప్రకటించారు. సంతోష్కుమార్ ప్రాథమిక, ఉన్నత విద్యను కామారెడ్డిలోనే చదివారు. ప్రభుత్వ కళాశాల కామారెడ్డిలో డిగ్రీ, ఉస్మానియాలో పీజీ పూర్తిచేసి పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. కామారెడ్డి నుంచి వచ్చిన తనకు ఎంజీయూ అక్కున చేర్చుకుని విద్యనందించడంతోనే పరిశోధన చేసి డాక్టరేట్ సాధించానని సంతోష్కుమార్ వెల్లడించారు. ఇక్కడి జిల్లా విద్యార్థులకే కాకుండా ఇతర జిల్లాల వారికి ఉస్మానియా, కాకతీయ ఇతర యూనివర్సిటీలకు దీటుగా డాక్టరేట్ ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఇస్మాయిల్పల్లి వాసి జాన్పాల్కు తొలి డాక్టరేట్
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఇస్మాయిల్పల్లి గ్రామానికి చెందిన రైతు నిన్నెకంటి రాయన్న ద్వితీయ కుమారుడు నిన్నెకంటి జాన్పాల్. తల్లిదండ్రుల కష్టం చూసిన జాన్పాల్ చదువులో ప్రతిభ చూపి ఉ త్తమ శ్రేణిలో రాణిస్తూ వచ్చాడు. ప్రాథమిక విద్యాభాస్యం స్వగ్రామంలోనే అభ్యసించాడు. 2009లో ఎంజీయూలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసి ఎంజీయూలో ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తూ నైపుణ్యం పెంచుకున్నారు. నెట్, సెట్ అర్హత సాధించి ఉండటంతో 2017లో వెల్లడించిన పీహెచ్డీ నోటిఫికేషన్స్లో దరఖాస్తు చేసి సీటు సాధించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అల్వాల రవి పర్యవేక్షణలో ఫిబ్రవరి 8, 2018నుంచి ‘డిజిటల్ ఎకానమీ అమలు కోసం మార్కెటింగ్ వ్యూహాలు’పై తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన రంగాలకు సంబంధించి పరిశోధన చేసి సమర్పించారు.
ఈ నెల 5న పీహెచ్డీ వైవా ప్రజెంటేషన్ నిర్వహించగా ఈ నెల 7న డాక్టరేట్ ప్రకటిస్తూ ఎంజీయూ పరీక్షల విభాగం సీఓఈ డాక్టర్ మిర్యాల రమేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. యూనివర్సిటీ చరిత్రలోనే బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో తొలి డాక్టరేట్ సాధించిన వ్యక్తిగా నిలిచారు. డాక్టరేట్ సాధించిన జాన్పాల్ను అసోసియేట్ ప్రొఫెసర్ గైడ్ డాక్టర్ అల్వాల రవితోపాటు వీసీ, రిజిస్ట్రార్ గోపాల్రెడ్డి, ప్రొఫెసర్ కృష్ణారావు, సహచర బోధన సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు కృషి చేస్తానని. తాను అధ్యాపకుడిగా పనిచేసిన చోటే బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో తొలి డాక్టరేట్ రావడం చాలా సంతోషంగా ఉందని, ఎంజీయూలో అందించే పరిశోధన అవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జాన్పాల్ తెలిపారు.