అభివృద్ధి బాటలో కలిసొస్తున్న కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు
టీఆర్ఎస్లోకి భారీగా వలసలు
సాగర్ అభివృద్ధికి కట్టుబడిన టీఆర్ఎస్కు మద్దతు
సర్పంచులు, మాజీ ఎంపీపీ, మాజీ ప్రజాప్రతినిధులు కూడా..
పెద్దసంఖ్యలో ముందుకు వస్తున్న యువత
నల్లగొండప్రతినిధి,(నమస్తేతెలంగాణ), మార్చి 24: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే పార్టీ నేతలతో పాటు శ్రేణులంతా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రజలను కలిసే పనిలో నిమగ్నమయ్యారు. మండలాల వారీగా ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి నేతలు ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా 10 రోజులుగా అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ ప్రచారం విస్తృతంగా సాగుతున్నది. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులు, అందుతున్న సంక్షేమ పథకాల లిస్టుతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇతర పార్టీల్లో ఉంటే అభివృద్ధికి దూరంగా ఉన్నట్లే అని.. అందుకే టీఆర్ఎస్లో చేరుతున్నామని వారు వ్యాఖ్యానించడం విశేషం.
సర్పంచులు, ఉప సర్పంచులు కూడా : ఇటీవల మాడ్గులపల్లి మండలం నారాయణపురం సర్పంచ్ ఆవుల అనిత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరారు. కన్నెకల్, గారకుంటపాలెం, ధర్మాపురం, పూసలపాడు నుంచి కూడా పెద్దసంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఇక తిర్మలగిరిసాగర్ మండలంలో మాజీ ఎంపీపీ అనుముల ఏడుకొండల్ తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, బాల్క సుమన్, జాజాల సురేందర్, కరీంనగర్ మేయర్ సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
గుర్రంపోడులో నిత్యం చేరికలే : గుర్రంపోడులో కూడా నిత్యం ఏదో ఒక గ్రామం నుంచి కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. జూనూతల మాజీ సర్పంచ్ లింగంపల్లి వెంకటయ్య కూడా తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యేల రోజువారీ ప్రచారంలోనూ చేరిక సంఖ్య అధికంగానే ఉంటున్నది. కాల్వపల్లి నుంచి 120 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భూపాల్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
కాంగ్రెస్ నుంచే అధికంగా : జూనూతల, మైలాపురం, ఎల్లమోనిగూడెం గ్రామాలకు చెందిన 100 మందికి పైగా కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఘాతీరాంతండాలో కాంగ్రెస్ సీనియర్ నేత రమణానాయక్ ఆధ్వర్యంలో 100 మందికి పైగా చేరారు. బొల్లారం, వట్టికోడు, ముల్కలపల్లి, పోచంపల్లి, చామలోనిబావి, జూనూతల నుంచి కూడా చేరికలు భారీగానే ఉన్నాయి. పెద్దవూర మండలంలోని పాల్తీతండాలో 50 మంది యువకులు ఎమ్మెల్యే బాల్క సుమన్ సమక్షంలో టీఆర్ఎస్లో జాయినయ్యారు. భట్టుగూడెం నుంచి 85 మంది, బెట్టేనితండా, నీమానాయక్ తండాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో యువకులు టీఆర్ఎస్లో చేరారు. హాలియా మండలంలోని జానారెడ్డి స్వగ్రామమైన అనుముల గ్రామంలో మూడు వందల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు దశలవారీగా టీఆర్ఎస్లో చేరారు.
జానా సొంతూరులోనూ : ఎమ్మెల్యే కోరుకొండ చందర్ నాయకత్వంలో హాలియా మున్సిపాలిటీలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనుముల నుంచి భారీగా చేరికలు జరిగాయి. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లోనూ టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. త్రిపురారం మండలంలో ఎమ్మెల్యే శంకర్నాయక్ సమక్షంలో పెద్ద ఎత్తున పలు గ్రామాల నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. పది రోజులుగా నీలాయిగూడెం, కొణతాలపల్లిలో మాజీ వార్డు సభ్యులు, రాగడప, కాపువారిగూడెం, లచ్యతండా, రూప్లాతండా, అప్పలమ్మగూడెం, రాజేంద్రనగర్, నీలాయిగూడెం, సత్యనారాయణపురం, పెద్దదేవులపల్లి, కంబాలపల్లి, కంపాసాగర్, జి.అన్నారం గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి టీఆర్ఎస్లో చేరుతున్నారు. వీరికి ఎమ్మెల్యే శంకర్నాయక్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
నిడమనూరులో నిత్యం చేరికలే : నిడమనూరు మండలం పార్వతీపురం సర్పంచ్ వంకా బ్రహ్మన్న తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే భాస్కర్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. శాఖాపురం మాజీ సర్పంచ్ భర్త చిన్నాల వెంకటయ్య, వెంగన్నగూడెంలో అయోధ్య నేతృత్వంలో, ఊట్కూర్, ఎర్రబెల్లి, సోమవారిగూడెం, ముప్పారం, కుంటిగొర్లగూడెం గ్రామాల నాయకులంతా ఎమ్మెల్యే భాస్కర్రావు నాయకత్వంలో టీఆర్ఎస్లో చేరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తేనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్లోకి మరింత మంది చేరే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.