హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : డిజిటల్ వేదికలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గుర్తించి తక్షణమే స్పందించే ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థలు తమ వద్ద ఉన్నాయని యూరోపియన్ పార్లమెంట్ డైరెక్టర్ జనరల్ ఫర్ కమ్యూనికేషన్ క్రిస్టియన్ మాంగోల్డ్ చెప్పారు. ఐరోపా దేశాల్లో ఎన్నికల విధానంపై అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి యూరోప్లో పర్యటిస్తున్నది. ఈ బృందం మంగళవారం మాంగోల్డ్తో సమావేశమైంది. ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం, సోషల్ మీడియా ఆధారిత దుష్ప్రచారాన్ని అడ్డుకొనే అంశంపై చర్చించింది.
అంతర్జాతీయ స్థాయిలో ఎన్నికల నిర్వహణలో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడం, డిజిటల్ యుగంలో ఎన్నికల విశ్వసనీయతను పరిరక్షించడమే లక్ష్యంగా తెలంగాణ బృందం యూరప్లో పర్యటిస్తున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈయూ ఎన్నికల వ్యవస్థ నిర్మాణం, ప్రజలతో కమ్యూనికేషన్ విధానం, ఫేక్న్యూస్ వ్యాప్తిని నియంత్రించేందుకు యూరోపియన్ యూనియన్ తీసుకుంటున్న సాంకేతిక, విధానపరమైన చర్యలను మాంగోల్డ్ వివరించారు. సీఈవో సుదర్శన్రెడ్డి భారత ఎన్నికల విధానాన్ని సమగ్రంగా వివరిస్తూ, వృద్ధులు, దివ్యాంగులు, వలస ఓటర్లు వంటి వర్గాలకు సులభంగా ఓటు హకు వినియోగించేలా భారత ఎన్నికల సంఘం అమలు చేస్తున్న నూతన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.