మొహాలీ: టీమిండియాకు ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ ప్రధాన బౌలర్. కానీ అతని బౌలింగ్ తీరు సరిగా లేదు. టీ20ల్లో అతను విఫలం అవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని మాజీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. మొహాలీలో మంగళవారం జరిగిన మ్యాచ్లోనూ భువీ మరోసారి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇది రోహిత్ సేనకు ఆందోళనకర విషయమే అని గవాస్కర్ అన్నారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో 19వ ఓవర్లో భువీ చాలా దారుణంగా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో అతను 16 రన్స్ ఇచ్చేశాడు. దీంతో చివరి ఓవర్లో కేవలం రెండు రన్స్ మాత్రమే డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇటీవల వరుసగా భువీ విఫలం అవుతున్న విషయాన్ని గవాస్కర్ గుర్తు చేశాడు.
ఆసియాకప్లో పాకిస్థాన్, శ్రీలంకతో జరిగిన మ్యాచుల్లోనూ భువీ దారుణంగా బౌలింగ్ చేసినట్లు చెప్పారు. ఆ రెండు మ్యాచుల్లోనూ 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్.. పాక్పై 16, లంకపై 14 రన్స్ సమర్పించుకున్నాడు. అయితే ఇంత అనుభవం ఉన్న బౌలర్.. ప్రత్యర్థుల్ని ముప్పుతిప్పలు పెట్టాలి,కానీ అతను పరుగులు ఇచ్చుకోవడం ఆందోళనకరమైన అంశమే అని అన్నారు. పాక్, శ్రీలంక, ఆసీస్తో జరిగిన మ్యాచుల్లో .. చివరి 18 బంతుల్లో భువీ 49 రన్స్ ఇచ్చాడని, అంటే ప్రతి బాల్కు మూడు రన్స్ ఇచ్చుకున్నాడని, ఇది కచ్చితంగా ఆందోళనకర విషయమే అని గవాస్కర్ అన్నారు. మొహాలీ టీ20లో భారత్ విసిరిన 208 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ మరో 4 బంతులు ఉండగానే అందుకున్న విషయం తెలిసిందే.