కొత్తదనంతో కూడిన కథాంశాలతో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నారు సుధీర్బాబు. తాజాగా మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారాయన. సుధీర్బాబు కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి పతాకంపై ఓ చిత్రం తెరకెక్కనున్నది. నారాయణ్దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ దర్శకుడు. సోమవారం హైదరాబాద్లో ఈ చిత్రం ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పుస్కూర్ రామ్మోహన్రావు క్లాప్నివ్వడంతో పాటు దర్శకుడికి స్క్రిప్ట్ను అందజేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమిది. వచ్చే వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం: పీజీ విందా.