Subhash Chandra : ఒకప్పుడు దేశ మీడియా రంగాన్ని శాసించిన ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ (Essel group chairman) సుభాష్ చంద్ర (Subhash Chandra) .. తాను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఆయన దాదాపు రూ.22,006 కోట్ల అప్పుచేశారు. కేవలం రూ.6.5 కోట్లు తిరిగి చెల్లించేలా సెటిల్మెంట్ చేసుకున్నారు. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) రుణ పరిష్కార ప్రణాళికను ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఆయన ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు.
ఆయన తీసుకున్న అప్పు మొత్తంలో రుణదాతలకు దాదాపు 99.97 శాతం నష్టం వాటిల్లుతున్న ఈ తరుణంలో సుభాష్ చంద్ర తన భవిష్యత్ ప్రణాళికలను ధైర్యంగా ప్రకటించారు. “నేను సర్వస్వం కోల్పోయిన వ్యక్తిగా మాట్లాడటం లేదు. నాకు మిగిలిన చివరి రూ.6.5 కోట్లు అప్పును కూడా ఆమోదించిన ప్లాన్ ప్రకారమే చెల్లించాల్సి ఉంటుంది. నాకు ఒక చిన్న ఇల్లు ఉంది, దానిని అద్దెకిచ్చి, వచ్చే ఆదాయంతోనే నా ఖర్చులు వెళ్లదీస్తున్నాను. నాకేమీ పశ్చాత్తాపం లేదు. నేను మళ్లీ సంపాదిస్తాను. నేను ఒక మార్గదర్శకుడిని. కొత్త విషయాలను ఎలా ప్రారంభించాలో నాకు తెలుసు, ఆ పని కొనసాగిస్తాను” అని 75 ఏళ్ల సుభాష్ చంద్ర తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్గా మీడియా నుంచి మౌలిక సదుపాయాలు, అమ్యూజ్మెంట్ పార్కుల వరకు ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. ఇప్పుడు తన తదుపరి ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్లో కొత్త పని చేయనున్నట్లు తెలిపారు. “ప్రస్తుతం స్విట్జర్లాండ్లో ఇన్వెస్ట్మెంట్ రంగంలో పనిచేసే నా స్నేహితులతో కలిసి పనిచేయాలని ఆలోచిస్తున్నాను. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకటి రెండు వారాల్లో వెల్లడిస్తాను. అలాగే కొన్ని స్టార్టప్లను ముందుకు నడిపించేందుకు నా కుటుంబం నుంచి రూ.2-4 కోట్ల వరకు అప్పు తీసుకునే అవకాశం కూడా ఉంది” అని ఆయన పేర్కొన్నారు.
ఎన్సీఎల్టీ ఆమోదించిన ప్రణాళిక ప్రకారం.. రుణదాతలు క్లెయిమ్ చేసిన రూ.22,006.57 కోట్లకు బదులుగా కేవలం రూ.6.5 కోట్లు మాత్రమే పంపిణీకి అందుబాటులో ఉంటాయి. ఇది రుణదాతలకు భారీ నష్టాన్ని మిగిల్చినప్పటికీ.. సుభాష్ చంద్ర మాత్రం ఆత్మవిశ్వాసంతో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.