న్యూఢిల్లీ: జిల్లా న్యాయ స్థానాలను మరింత బలోపేతం చేయాలని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా న్యాయ ఉద్యమాన్ని చేపట్టడంలో జిల్లా కోర్టులు చోదకాలుగా పనిచేస్తాయన్నారు. చాలా వరకు కేసుల్లో జిల్లా జుడిషియల్ అధికారులే కాంటాక్ట్లోకి వస్తారని, జిల్లా న్యాయస్థానాల వద్ద తమకు కలిగిన అనుభవాల ద్వారానే న్యాయవ్యవస్థపై ప్రజల్లో ప్రజాభిప్రాయం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఢిల్లీలో జరిగిన నల్సా తొలి ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ సమావేశంలో ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లా న్యాయవ్యవస్థను బలోపేతం చేయడం ఇప్పుడు అత్యంత అవసరమని, దేశంలో న్యాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో జిల్లా న్యాయస్థానాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదన్నారు.
ఈ కోర్టు మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా వర్చువల్ కోర్టులను ప్రారంభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన కేసులను పరిష్కరించేందుకు కోర్టులు 24 గంటల పాటు పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టేందుకు అన్ని కోర్టుల్లో మౌళికసదుపాయాలను విస్తరించినట్లు ప్రధాని తెలిపారు. సమాజంలో న్యాయవ్యవస్థ అందరికీ అందుబాటులో ఉండాలని, న్యాయం కూడా అందరికీ సమానంగా అందాలన్నారు. న్యాయ వ్యవస్థ మౌళిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు గడిచిన 8 ఏళ్లలో ఎంతో పనిచేశామని మోదీ అన్నారు.