సుల్తాన్బజార్,డిసెంబర్ 15: విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆర్ధిక భరోసాను కల్పిస్తున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఈ మేరకు బుధవారం మాసబ్ట్యాంక్లోని సమాచార భవన్లోని మీడియా అకాడమీ కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 64 మంది కొవిడ్-19తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున, 40 మంది సాధారణ మరణం పొందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల చొప్పున, ప్రమాదాలు, తీవ్ర అనారోగ్యం బారిన పడిన 8 మంది వర్కింగ్ జర్నలిస్టులకు రూ.50 వేల చొప్పున మొత్తంగా ఒక కోటి 74 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం కింద చెక్కులను ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సీఎం కేసీఆర్ చొరవతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నిధి జర్నలిస్టుల పెన్నిదిగా మారిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.