న్యూఢిల్లీ : పరిపాలనా వైఫల్యం, అంతర్గత వర్గపోరుతో వివాదాల్లో నిలిచిన భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ)పై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు తీసుకుంది. టీటీఎఫ్ఐకి ఉన్న జాతీయ క్రీడా సమాఖ్య గుర్తింపును రద్దు చేసినట్టు బుధవారం ప్రకటించింది. సమాఖ్య రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు, ఆసియా గేమ్స్ ముంగిట ఆటగాళ్లకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్)తో సంప్రదించి వెంటనే ఓ అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేయాలని భారత ఒలింపిక్ సంఘాన్ని (ఐఓఏ) ఆదేశించింది.
సమయానికి ఎన్నికలు నిర్వహించకపోవడం, జాతీయ పోటీల నిర్వహణలో ఆలస్యం చేయడం, పారదర్శకత లోపించడంతోనే సమాఖ్యపై వేటు వేసినట్టు క్రీడా శాఖ స్పష్టం చేసింది. గత కొన్ని నెలలుగా టీటీఎఫ్ఐ అధ్యక్షురాలు మేఘనా అహ్లావత్, ప్రధాన కార్యదర్శి కమలేష్ మెహతా మధ్య తీవ్ర ఆధిపత్య పోరు సాగుతోంది. కమలేష్ను ఫెడరేషన్ సస్పెండ్ చేయగా.. కోర్టు ఈ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో తమ షోకాజ్ నోటీసుకు టీటీఎఫ్ఐ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని దాని గుర్తింపు రద్దు చేస్తూ క్రీడా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.