యాదాద్రి, నవంబర్26 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో కార్తిక మాసం శుక్రవారం సందర్భంగా లక్ష్మీపూజలు వైభవంగా జరిగాయి. బాలాలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. మహిళా భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తరించారు. లక్ష్మి అమ్మవారిని విశేష పుష్పాలతో అలంకరించారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మండపంలోని ఊయలతో శయనింపు చేయించారు. గంటపాటు అమ్మవారిని కొలుస్తూ లాలిపాటలు పాడారు. బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం, తులసీ అర్చనలు చేశారు. ప్రధానాలయంలో స్వయంభువును కొలిచిన ఆచార్యులు బాలాలయ కవచ మూర్తులను 108 సువర్ణ పుష్పాలతో అర్చించారు. ఉదయం 4 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు, హారతి నివేదనలు జరిపించారు. శ్రీసుదర్శన నరసింహహోమం ద్వారా శ్రీవారిని, ఆళ్వారులను కొలిచారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలో ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నరసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకుపైగా కల్యాణ తంతు జరిపారు. నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాతగుట్ట లక్ష్మీనరసింహుడి సన్నిధిలో నిత్యపూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కార్తికమాసం సందర్భంగా యాదాద్రి కొండకింద గల పాతగోశాల వ్రత మండపంతోపాటు పాతగుట్ట ఆలయంలో సత్యనారాయణ వ్రతాలు పెద్ద సంఖ్యలో జరిగాయి. శ్రీవారి ఖజానాకు శుక్రవారం రూ. 15,27,331 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
హుండీ ఏర్పాటుకు రూ. 1.72 లక్షల విరాళం
యాదాద్రీశుడి సన్నిధిలోని హుండీ ఏర్పాటుకు హైదరాబాద్కు చెందిన మధురాబాబు రూ. 1,72, 000 విరాళాన్ని ఆలయ ఈఓ గీతకు అందించాడు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 2,06,870
రూ.100 దర్శనం టిక్కెట్ 70,000
వేద ఆశీర్వచనం 6,192
క్యారీబ్యాగుల విక్రయం 7,400
నిత్యకైంకర్యాలు 4,802
వ్రత పూజలు 2,77,000
కల్యాణకట్ట టిక్కెట్లు 17,600
ప్రసాద విక్రయం 4,78,050
వాహన పూజలు 8.500
టోల్గేట్ 1380
అన్నదాన విరాళం 21,029
సువర్ణ పుష్పార్చన 1,35,500
యాదరుషి నిలయం 74,000
పాతగుట్ట నుంచి 82,560
గోపూజ 1500
సుప్రభాతం 900
ఇతర విభాగాలు 98,948