హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలో కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయని, అకడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కరోనా, కొత్త వేరియంట్ వ్యాప్తిని గమనిస్తూ ఉండాలని చెప్పారు. రోజూవారీ పరిశీలనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్, మూడో వేవ్ సన్నద్ధతపై బీఆర్కే భవన్లో మంగళవారం మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడో వేవ్ ముంచుకొచ్చినా ఎదురొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 21 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు, 545 టన్నుల ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
దవాఖానల్లో 27,996 పడకలకు గానూ 25,826 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించామని, మిగిలిన పడకలకు కూడా వేగంగా ఆక్సిజన్ సౌకర్యం సమకూర్చాలని చెప్పారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్లో మందులు నిల్వ ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు కూడా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని, మాస్కు ధరించటం, భౌతిక దూరం వంటి కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. సమీక్షలో సీఎస్ సోమేశ్ కుమార్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.