న్యూఢిల్లీ : ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం డిసెంబర్ 4న సంభవించనున్నది. ఈ సూర్య గ్రహణం అంటార్కిటికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలో కనిపిస్తుందని, అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదని ఖగోళ నిపుణులు తెలిపారు. భారత కాలమాన ప్రకారం వచ్చే నెల 4న ఉదయం 10.59గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 3.07 గంటలకు ముగియనున్నది. సూర్యుడు.. భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల చంద్రుడి నీడ భూమిపై పడినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుందని అందరికి తెలిసిందే.
ఈ ఏడాది నాలుగు గ్రహణాలుండగా.. రెండు చంద్రగ్రహణాలు, మరో రెండు సూర్యగ్రహణాలున్నాయి. ఈ మే 26న తొలి, నవంబర్ 19న రెండో చంద్రగ్రహణం ఏర్పడింది. జూన్ 10న తొలి సూర్యగ్రహణం ఏర్పడగా.. వచ్చే నెలలో మరో సూర్యగ్రహణం సంభవించనున్నది. ఈ నెల 19న 580 సంవత్సరాల తర్వాత సుదీర్ఘకాల అరుదైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది.
ఫిబ్రవరి 18న, 1440లో ఈ తరహా చంద్రగ్రహణం ఏర్పడగా.. మళ్లీ 2669 సంవత్సరంలో ఫిబ్రవరి 8న ఈ సుదీర్ఘమైన గ్రహణం కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. వచ్చే ఏడాది నాలుగు గ్రహణాలు సంభవించనుండగా.. ఇందులో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలున్నాయి. రెండు సంపూర్ణ చంద్రగ్రహణాలు మాత్రమే భారత్లో కనిపించనున్నాయి.