న్యూఢిల్లీ: జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ పతకాల వేటలో అదరగొట్టింది. తన అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ ఇషా మొత్తంగా ఆరు పతకాలతో మెరిసింది. పోటీల ఆఖరి రోజైన సోమవారం జరిగిన 25మీటర్ల మహిళల జూనియర్ విభాగంలో ఇషా(27) కాంస్య పతకంతో మెరిసింది. షూటింగ్ సంచలనం నామ్యా కపూర్(30), మను భాకర్(30) వరుసగా స్వర్ణ, రజత పతకాలు దక్కించుకున్నారు. ఈ ఇద్దరి స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు జరిగిన షూటాఫ్లో నామ్యా 5-4తో మనుపై గెలిచి పసిడి ఒడిసిపట్టుకుంది. మరోవైపు మహిళల 25మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో తెలంగాణ త్రయం ఇషాసింగ్, జాబిలి, దివ్య 1688 పాయింట్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. హర్యానా, మహారాష్ట్ర జట్లు వరుసగా పసిడి, వెండి పతకాలను దక్కించుకున్నాయి. ఈ టోర్నీలో 16 ఏండ్ల హైదరాబాదీ ఇషాసింగ్ రెండు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలతో తనకు తిరుగులేదని ఘనంగా చాటిచెప్పింది.